కూసుమంచి, వెలుగు: ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలోకి కారు దూసుకెళ్లడంతో ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కూసుమంచి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా పాలేరు జలాశయంలోకి దూసుకెళ్లింది. దూరం నుంచి ఈ విషయాన్ని గమనించిన జాలరులు, పోలీసులకు సమాచారం అందజేశారు.
క్రేన్ సహాయంతో నీట మునిగిన కారును పోలీసులు వెలికి తీశారు. కారులో వెనుక సీటులో ఏపీలోని కర్నూల్ జిల్లా నందికొట్కూరుకు చెందిన బొగ్గుల శ్రీనివాస్(50) మృతదేహం ఉండగా, డ్రైవర్ ప్రాణాలతో బయటపడి పారిపోయాడు. దీంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్ పదేళ్లుగా హైదరాబాదులో ఉంటున్నారు.
‘పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశ సమయంలో పవన్ కల్యాణ్ హటావో, పాలిటిక్స్ బచావో పేరుతో ఈయన రాసిన పుస్తకం వివాదాస్పదంగా మారింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి తనకు ప్రమాదం ఉందంటూ ఆయన పోలీసులను కూడా ఆశ్రయించారు.
ఉద్దేశపూర్వకంగానే కారును పాలేరు జలాశయంలోకి నడిపి, డ్రైవర్ పరార్ అయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్ డెడ్బాడీని నేలకొండపల్లి దవాఖానకు తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు కూసుమంచి ఎస్సై నాగరాజు తెలిపారు.
