- చిన్న వెంచర్ క్యాపిటల్ ఫండ్స్లో పెట్టుబడి.. వాటితో స్టార్టప్లలో ఇన్వెస్ట్మెంట్
- మాన్యుఫాక్చరింగ్ సెక్టార్కు ప్రాధాన్యం
న్యూఢిల్లీ: ఇండియాలోని స్టార్టప్లకు క్యాపిటల్ సపోర్ట్ అందించేందుకు ప్రభుత్వం రూ.10 వేల కోట్లతో స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్ఓఎఫ్) 2.0 ని తీసుకొచ్చింది. స్టార్టప్లకు మూలధనాన్ని అందించడం, వెంచర్ క్యాపిటల్ బేస్ను బలపరచడం, ఇన్నోవేషన్ ఆధారిత ఎంటర్ప్రెనూర్షిప్కు మద్దతు ఇవ్వడం ఈ స్కీమ్ ఉద్దేశం. దీనికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద కేబినెట్ తాజాగా ఆమోదం తెలింది.
స్టార్టప్ ఇండియా 2.0 ఇలా పనిచేస్తుంది..
ఇది నేరుగా స్టార్టప్లలో పెట్టుబడి పెట్టదు. బదులుగా, ఇతర వెంచర్ క్యాపిటల్ లేదా ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్లో పెట్టుబడి పెడుతుంది. దీని వల్ల రిస్క్ తగ్గుతుంది. అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు డబ్బును మేనేజ్ చేస్తారు.హై టెక్ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ముఖ్యంగా ఎక్కువ కాలంపాటు క్యాపిటల్ అవసరముండే మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లోని స్టార్టప్లకు ప్రాధాన్యం ఇస్తారు. ఎర్లీ స్టేజ్లో నిధుల కొరత వల్ల చాలా స్టార్టప్లు ఫెయిల్ అవుతున్నాయి. వీటిపై దృష్టి ఉంటుంది. మెట్రో నగరాలకే కాకుండా దేశవ్యాప్తంగా పెట్టుబడులు ప్రోత్సహిస్తారు.
ఆర్థిక వృద్ధికి కీలకమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, దేశంలోని చిన్న వెంచర్ క్యాపిటల్ ఫండ్స్కు మద్దతు ఇచ్చి దేశీయ పెట్టుబడి వాతావరణాన్ని విస్తరించడం ఈ స్టార్టప్ ఫండ్ ముఖ్య ఉద్దేశం. ‘‘స్టార్టప్ ఫండ్ 2.0తో భారత స్టార్టప్లను గ్లోబల్ స్థాయిలో పోటీపడేలా చేయొచ్చు. ఇది కొత్త టెక్నాలజీలు, ఉత్పత్తులు, పరిష్కారాలను అభివృద్ధి చేసే స్టార్టప్లకు మద్దతు ఇస్తుంది. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. తయారీ సామర్థ్యాలు బలోపేతం అవుతాయి. హై క్వాలిటీ ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి”అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
