న్యూఢిల్లీ: రష్యా రక్షణ రంగం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేస్తున్నాయనే ఆరోపణలతో గతంలో ఆంక్షలు ఎదుర్కొన్న నాలుగు భారతీయ కంపెనీలను అమెరికా తాజాగా ఆ జాబితా నుంచి తొలగించింది. హైదరాబాద్కు చెందిన ఆర్ఆర్జీ ఇంజినీరింగ్ టెక్నాలజీస్ , లోకేష్ మెషీన్స్, అహ్మదాబాద్కు చెందిన గెలాక్సీ బేరింగ్స్, ఢిల్లీ కేంద్రంగా పనిచేసే శౌర్య ఏరోనాటిక్స్పై ఆంక్షలను అమెరికా ట్రెజరీ శాఖ ఉపసంహరించుకుంది.
గతంలో ఈ సంస్థలు రష్యాకు రాడార్ పరికరాలు, మైక్రో ఎలక్ట్రానిక్స్, మెషిన్ టూల్స్ , రోలర్ బేరింగ్స్ వంటి కీలక వస్తువులను సరఫరా చేశాయని పేర్కొంది. ఆంక్షల తొలగడంతో ఈ కంపెనీలు అమెరికన్ కంపెనీలతో సాధారణ కార్యకలాపాలను నిర్వహించుకునే అవకాశం లభించింది.
