- డిసెంబర్ సంక్షోభం తర్వాత చర్యలు ముమ్మరం
న్యూఢిల్లీ: అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగో, వెయ్యి మందికి పైగా పైలట్లను నియమించుకునేందుకు భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టనుంది. ఇది కంపెనీ నిర్వహిస్తున్న అతి పెద్ద నియామకాలలో ఒకటి. 2025 డిసెంబర్లో కొత్త పైలట్ డ్యూటీ, రెస్ట్ నిబంధనలు అమలులోకి రావడంతో, ఇండిగో ఏడు రోజుల్లో ఐదు వేలకి పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.
కంపెనీ తగినంతగా పైలట్లను నియమించకపోవడం, శిక్షణ వేగవంతం చేయకపోవడం వల్ల రోస్టర్ బఫర్ మార్జిన్లు తగ్గాయని, అందుకే ఈ సంక్షోభం నెలకొందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తేల్చింది. కొత్త నియామకాల్లో ట్రెయినీ ఫస్ట్ ఆఫీసర్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లు, కెప్టెన్లు ఉంటారు. ఎయిర్బస్ ఏ320 అనుభవం లేని పైలట్లను కూడా నియమించుకునేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది.
ఇండిగో షెడ్యూల్డ్ సర్వీస్లను నిర్వహించేందుకు 2,422 మంది పైలట్లు అవసరం. ప్రస్తుతం 2,357 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇండిగో ప్రతి నెల నాలుగు కొత్త విమాన సర్వీస్లను మొదలు పెడుతోంది. దీంతో పైలట్ల అవసరం తీవ్రంగా ఉంది. కంపెనీ నెలకు 20–25 ఫస్ట్ ఆఫీసర్లను కెప్టెన్లుగా ప్రమోట్ చేస్తోంది.
హైదరాబాద్లో కొత్త ఈ–చేతక్
బజాజ్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను సీ25ను సిద్ధి వినాయక బజాజ్ సంస్థ ద్వారా హైదరాబాద్ సైనిక్పురి షోరూంలో విడుదల చేసింది. మెటల్ బాడీతో తయారైన ఈ స్కూటర్ ఒక చార్జింగ్తో 113 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఇందులో 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ, కలర్ టీఎఫ్టీ కన్సోల్, బ్లూటూత్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. రివర్స్ మోడ్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి ఆదనపు ఆకర్షణలు. తెలంగాణలో దీని ధర రూ. 87,100.
