
- వాటిలో పిల్లలను తరలిస్తే కఠిన చర్యలు తప్పవు
- విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరిక
హైదరాబాద్ సిటీ, వెలుగు: స్కూళ్లు జూన్12 నుంచి తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల వాహనాలు తప్పనిసరిగా ఫిట్నెస్ కలిగి ఉండాలని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను రవాణా చేసే 25,677 స్కూల్ బస్సుల్లో 17,020 మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాయని, మిగిలిన 8,657 బస్సులు వెంటనే సంబంధిత రవాణా శాఖ ఆఫీసుల్లో సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు.
15 ఏండ్లు దాటిన స్కూల్ బస్సులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిరగరాదని, ఫిట్నెస్ లేని వాహనాల్లో విద్యార్థులను రవాణా చేస్తే సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యా సంస్థల వాహనాల నిర్వహణ బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని అన్నారు. యాజమాన్యాలు బస్సులను మంచి కండిషన్లో ఉంచాలని, ఎక్స్ పీరియెన్స్ ఉన్న డ్రైవర్లనే నియమించాలని సూచించారు. అన్ని జిల్లాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.