
- ముగిసిన డీఎస్సీ దరఖాస్తుల గడువు
- 11,062 పోస్టులకు 2,79,956 అప్లికేషన్లు
- హైదరాబాద్లో ఎక్కువ.. మేడ్చల్లో తక్కువ
- వచ్చే నెల17 నుంచి ఆన్లైన్లో పరీక్షలు
హైదరాబాద్, వెలుగు: మెగా డీఎస్సీకి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,062 టీచర్ పోస్టుల కోసం 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 25 మంది పోటీ పడుతున్నారు. డీఎస్సీ పరీక్షలు వచ్చేనెల 17 నుంచి ఆన్లైన్లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను నేడో, రేపో రిలీజ్ చేయనున్నారు. గతేడాది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసిన కొత్త ప్రభుత్వం.. ఫిబ్రవరి 29న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 4 నుంచి ఈ నెల 20వరకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగింది.
గురువారం రాత్రి వరకూ 2,85,288 మంది ఫీజు చెల్లించగా.. 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ ఫలితాల నేపథ్యంలో డీఎస్సీ అప్లికేషన్లకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఎడిట్ ఆప్షన్ ఇవ్వగా.. 74,162 మంది తమ అప్లికేషన్లను ఎడిట్ చేసుకున్నారు. దరఖాస్తుదారుల్లో ఇదివరకే డీఎస్సీ2023కి అప్లై చేసుకున్న 1.77 లక్షల మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. కాగా, 2017లో జరిగిన టీఆర్టీలో 8,792 పోస్టులకు 2,77,574 మంది అప్లై చేయగా, ఒక్కో పోస్టుకు 31 మంది పోటీ పడ్డారు.
అప్పట్లో పోస్టులు తక్కువ ఉన్నా, పోటీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పోస్టులు భారీగా ఉన్నా.. గతం కంటే అప్లికేషన్లు పెద్దగా పెరగలేదు. అయితే, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు భారీగా పోటీ నెలకొన్నది. ఒక్కో పోస్టుకు 56 మంది పోటీ పడుతున్నారు. ఎస్జీటీ పోస్టులకు మాత్రం పోటీ తక్కువగా ఉంది. ఒక్కో పోస్టుకు కేవలం 12 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. ఒక్కో పండిట్ పోస్టుకు 25 మంది, ఒక్కో పీఈటీ పోస్టుకు 65 మంది పోటీ పడుతున్నారు.
పట్నంలోనే ఎక్కువ
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన అప్లికేషన్లలో అత్యధికంగా హైదరాబాద్ లో 27,027 మంది ఉన్నారు. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 2,265 మంది అప్లై చేశారు. ఎక్కువగా నల్గొండలో 15,610 మంది, నిజామాబాద్ లో 13,166 మంది, ఖమ్మంలో 12,970 మంది, వికారాబాద్ లో 12,856, సూర్యపేటలో 11,907, జనగామలో 11,021, నాగర్ కర్నూల్ లో10,651, సంగారెడ్డిలో 10,569 మంది దరఖాస్తు చేశారు.
తక్కువగా జయశంకర్ భూపాలపల్లిలో 2,828, ములుగులో 2,908 మంది అప్లై చేశారు. కాగా, ఇటీవల నిర్వహించిన టెట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఉచితంగా అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ కేటగిరీలో 24,975 మంది పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోగా, వారిలో 23,919 మంది దరఖాస్తు చేసుకున్నారు.