
హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ ఎక్సైజ్ శాఖ నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారం రోజులో 1188 మద్యం బాటిళ్లను పట్టుకుంది. జూన్ 3 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు. ఈ వారం రోజుల దాడుల్లో రూ. 25 లక్షల విలువైన 1188 మద్యం బాటిళ్లు, 22 లీటర్ల బీరు, 21 లీటర్ల దేశీ దారును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ , ఎన్ఫోర్స్మెంట్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్లతో పాటు ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది కలిసి పాల్గొన్నారు. మొత్తం 64 కేసులు నమోదు చేయగా, 33 మందిని అరెస్టు చేశారు. అలాగే, 19 వాహనాలను సీజ్ చేశారు.
ఢిల్లీ, గోవా నుంచి వచ్చే రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పద బ్యాగులను తనిఖీ చేసి 40 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి వాస్కోడిగామా రైలులో వచ్చిన మద్యాన్ని వికారాబాద్ ఎక్సైజ్ , డీటీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. అలాగే శంషాబాద్, సరూర్నగర్, మల్కాజ్గిరి, వికారాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో NDPL మద్యాన్ని, అదిలాబాద్, నిర్మల్, అసిఫాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో దేశీ దారును పట్టుకున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగించాలని, అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు అన్ని టీమ్లు నిరంతర దాడులు నిర్వహించాలని షానవాజ్ ఖాసీం ఆదేశించారు. వినియోగదారులు అక్రమ మద్యాన్ని వినియోగించవద్దని ఆయన సూచించారు.