జమ్మికుంట, వెలుగు : సమాజంలో 52 శాతం ఉన్న బీసీ కులస్తులకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో గౌడ కులస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వందల కోట్లు సంపాదించారన్నారు. కానీ శ్రమను నమ్ముకుని, నీతి, నిజాయతీతో పనిచేస్తున్న గౌడకులస్తులు మాత్రం ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదన్నారు. గౌడ కులస్తులకు రాష్ట్ర బడ్జెట్లో 8 శాతం వాటా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. యాదాద్రి ఆలయానికి కేసీఆర్ రూ. 1,200 కోట్లు ఇచ్చారని, అదేవిధంగా మల్లన్న దేవాలయాలు, రేణుక ఎల్లమ్మ క్షేత్రాలను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు.
వైన్ షాపులలో గౌడన్నలకు 15 శాతం రిజర్వేషన్ పెట్టి, డిపాజిట్ పేరుతో లక్షలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 శాతం ఉన్న అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ ఉందన్నారు. గౌడ కులస్తులకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గీతబంధు ప్రకటించాలని, మద్యం షాపుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్చేశారు. జనగామ జిల్లాకు సర్వాయిపాపన్న పేరు పెట్టాలని గుర్తు చేశారు. ఇటీవల హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ను అరెస్టు చేసిన ప్రభుత్వం, దళిత బహుజన ఆదివాసీ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. హిందూ దేవుళ్లపై చిన్నజీయర్స్వామి, రాంగోపాల్వర్మ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గౌడ కులస్తుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సాంబశివగౌడ్, సంజయ్, విశ్వం, రవి, మహిళా కన్వీనర్శిరీష్, స్వప్న గౌడ్, నరేశ్తదితరులు పాల్గొన్నారు.