- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల టౌన్, వెలుగు: జడ్చర్ల నియోజకవర్గంలోని మహిళా సాధికారతకు బాటలు వేస్తూ 84 గ్రామైక్య సంఘాలకు (వీఓ) సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద ఒక్కో భవనానికి రూ. 10 లక్షలతో మొత్తం రూ. 8.40 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
నవాబుపేటలో 24, బాలానగర్లో 17, ఊర్కొండలో 16, జడ్చర్లలో 14, రాజాపూర్లో 8, మిడ్జిల్ మండలంలో 5 భవనాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఈ భవనాల నిర్మాణంతో గ్రామీణ మహిళా సంఘాలు మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందని, దాంతో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు.
గ్రామాల్లో భవన నిర్మాణానికి స్థలం అందుబాటులో ఉన్న చోట పనులను త్వరగా ప్రారంభించాలని పేర్కొన్నారు. మహిళా సంఘాలు క్రియాశీలకంగా ఉన్న ప్రాంతాల్లో ఈ భవనాల నిర్మాణం పూర్తయితే, సమావేశాలు నిర్వహించుకోవడానికి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
