- డాక్టరేట్ పట్టాలు, గోల్డ్ మెడల్స్ అందుకున్న అభ్యర్థులు
- మురిసిన తల్లిదండ్రులు
- జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గవర్నర్ జిష్ణుదేవ్ పర్యటన
కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీలో రెండో కాన్వొకేషన్ శుక్రవారం ఘనంగా ముగిసింది. కాన్వొకేషన్కు వర్సిటీలో స్పోర్ట్స్ గ్రౌండ్లో ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హెచ్సీయూ వీసీ బి.జగదీశ్వర్రావు, శాతవాహన వీసీ ఉమేశ్కుమార్ హాజరై.. 25 మందికి పీహెచ్డీ పట్టాలు, 161 మందికి గోల్డ్ మెడల్స్ అందజేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ రాకతో ప్రారంభమైన ప్రోగ్రామ్ మధ్యాహ్నం 12.15 గంటలకు ముగిసింది.
విద్యార్థులందరికీ అతిథుల చేతుల మీదుగా పట్టాలు, మెడల్స్ అందజేశారు. కాన్వొకేషన్ సందర్భంగా యూనివర్సిటీ క్యాంపస్లో సందడి నెలకొంది. పట్టాలు, మెడల్స్ అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కళకళలాడింది. కార్యక్రమం అనంతరం తమకు వచ్చిన పట్టాలు, గోల్డ్ మెడల్స్తో సెల్ఫీలు, గ్రూపు ఫొటోలు దిగుతూ సంతోషంగా గడిపారు.
గవర్నర్ కు ఘన స్వాగతం..
గవర్నర్ ఉదయం 10.40 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా యూనివర్సిటీకి చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్ పమేలా సత్పతి, వీసీ ఉమేశ్కుమార్, సీపీ గౌష్ ఆలం బొకేతో స్వాగతం పలికారు. తొలుత పోలీసులు గవర్నర్కు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం బ్యాండ్ వాయిద్యాలతో గవర్నర్, హెచ్ సీయూ వీసీ కాన్వొకేషన్ వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు, గోల్డ్ మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకాడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, వర్సిటీ రిజిస్ట్రార్ రవికుమార్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సూరేపల్లి సుజాత పాల్గొన్నారు.
తెలుగులో నాలుగు గోల్డ్ మెడల్స్
మెడలో నాలుగు గోల్డ్ మెడల్స్తో కనిపిస్తున్న ఈమె పేరు సిరిపురం అమరానంద. శాతవాహన యూనివర్సిటీలో ఎంఏ తెలుగు పూర్తి చేసింది. ఆధునిక సాహిత్య విమర్శ, ఆధునిక కవిత్వం, వ్యాకరణం భాషా చరిత్ర పేపర్లతోపాటు కోర్సులో అత్యధిక మార్కులకు కలిపి 4 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. 4 గోల్డ్ మెడల్స్ రావడం చాలా సంతోషంగా ఉందని అమరానంద చెప్పారు. చిన్నప్పటి నుంచి తనకు తెలుగంటే చాలా ఇష్టమని, గవర్నమెంట్ టీచర్ కావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
