ఫోన్ ​ట్యాపింగ్​ కేసులో .. 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!

ఫోన్ ​ట్యాపింగ్​ కేసులో .. 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
  • త్వరలోనే వారిపై అనర్హత వేటు పడ్తది: రాజగోపాల్​ రెడ్డి
  • కేసీఆర్, హరీశ్​రావు కూడా జైలుకు పోవుడు ఖాయం  
  • రేవంత్​ రెడ్డికి.. కోమటిరెడ్డి బ్రదర్స్​తోడైతే బీఆర్ఎస్​లో ఒక్కరూ మిగలరని వెల్లడి

జనగామ, వెలుగు: ఫోన్​ ట్యాపింగ్​కేసులో 30 మంది బీఆర్ఎస్​ ఎమ్మెల్యేల ప్రమేయం ఉందని భువనగిరి లోక్​సభ కాంగ్రెస్ ఇన్​చార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్​రెడ్డి అన్నారు. అధికార దుర్వినియోగంతో వారంతా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫోన్​ ట్యాపింగ్ ​చేసి, పోలీసుల వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లి పంచి గెలిచిన విషయం బయటపడిందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే వారందరిపై అనర్హత వేటు పడుతుందన్నారు. ఈ కేసులో కేసీఆర్, హరీశ్​రావు కూడా జైలుకు పోవుడు ఖాయమని చెప్పారు. 

శనివారం జనగామలో డీసీసీ ప్రెసిడెంట్​ కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్​ కుమార్ ​రెడ్డి గెలుపు కోసం ఆర్​అండ్​బీ గెస్ట్​హౌజ్​నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు రోడ్​ షో నిర్వహించారు. దీనికి పీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ​మహేశ్​కుమార్ ​గౌడ్​తో కలిసి రాజగోపాల్​రెడ్డి చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్​ను బతికి బట్టకట్టనిచ్చేదే లేదని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని పదేండ్ల పాటు కేసీఆర్​ దోచుకుతిన్నదంతా కక్కిస్తాన్నారు. కేసీఆర్ ​జాగ్రత్తగా మాట్లాడాలని, ఎక్కువ మాట్లాడితే బొక్కలో వేస్తామని హెచ్చరించారు. లిక్కర్​ స్కాంలో ఇప్పటికే బిడ్డ కవిత తీహార్​ జైల్లో ఉందని, పదేండ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్​ రెడ్డికి కోమటిరెడ్డి బ్రదర్స్​తోడైతే బీఆర్​ఎస్​లో ఒక్కరు కూడా మిగలరని అన్నారు. చామల కిరణ్​ కుమార్​ రెడ్డినే భారీ మెజారిటీతో గెలిపించాలని ముప్పై మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడగానే.. జనగామలో కొమ్మూరి ప్రతాప్​రెడ్డి ఎమ్మెల్యే అవుతారని రాజగోపాల్​రెడ్డి అన్నారు. 

కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం

కేంద్రంలో ఇండియా కూటమే అధికారంలోకి వస్తుందని మహేష్​  కుమార్ ​గౌడ్ అన్నారు.​ రాహుల్​ ప్రధాని అవడం ఖాయమన్నారు. మోదీకి మళ్లీ ఓటెయ్యొద్దని కోరారు. డీసీసీ ప్రెసిడెంట్​కొమ్మూరి మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమ పాలన అందిస్తున్న సీఎం రేవంత్​ రెడ్డికి అండగా ఉండేందుకు జనం చేతి గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. ఎంపీ అభ్యర్థి చామల మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే జనగామను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు. జనగామలో దొంగ ఓట్లతో గెలిచిన పల్లా రాజేశ్వర్​ రెడ్డికి బుద్ధి చెప్పాలని కోరారు.