హైదరాబాద్ లో రోజు రోజుకూ కరోనా కేసులు ఎక్కవ నమోదవుతున్నాయి. దీంతో వైరస్ వ్యాపించకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తగా మాస్కులు ధరిస్తున్నారు. దీంతో మాస్కులకు మార్కెట్లో గిరాకీ పెరిగింది. అయితే ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు తమ టాలెంట్ చూపిస్తూ…ప్రజలను దోచుకుంటున్నారు.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్కు చెందిన ఓ సంస్థ నుంచి ఏకంగా రూ.30 లక్షలు దోచుకున్నారు. హంగేరీకి చెందిన ఓ కంపెనీ పేరుతో ఇండియా మార్ట్ సైట్లో ఓ ప్రకటన వచ్చింది. హోల్సేల్ ధరలకే మాస్కులు, గ్లౌజులు అందిస్తామని అందులో ఉంది. ఇందుకు సంబంధించి ఓ కొటేషన్ కూడా ఉంచింది. గ్లౌజులు, మాస్కులు హోల్ సేల్గా అమ్మే జూబ్లీహిల్స్ లోని ఓ సంస్థ ఈ కొటేషన్ చూసి హంగేరీ సంస్థను సంప్రదించింది.
కొటేషన్లు ఇచ్చిన తర్వాత హంగేరీ కంపెనీ ప్రతినిధిగా చెప్పుకునే ఓ వ్యక్తి వాట్సాప్ ద్వారా అగ్రిమెంట్ పంపించి సరుకు పంపాలంటే మొదట రూ. 30 లక్షలు బదిలీ చేయాలన్నాడు. నమ్మిన ఆ సంస్థ ఆ కంపెనీ చెప్పిన ఖాతాకు ఆ మొత్తాన్ని బదిలీ చేసింది. ఆ తర్వాత గడువు ముగిసినా సరుకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సంస్థ తమకు పరిచయమైన వ్యక్తికి ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో మోసపోయినట్టు గ్రహించిన సంస్థ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.