ఏపీలో కొత్తగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీలు

ఏపీలో కొత్తగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీలు

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక కాలేజీ

ఇప్పటికే 20 చోట్ల స్థలాల గుర్తింపు… మిగిలిన చోట్ల కూడా చురుగ్గా భూ సేకరణ

పురోగతిపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష

అమరావతి: ఏపీలో కొత్తగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీల ఏర్పాటు దిశగా ప్రభుత్వం చకచకా చర్యలు తీసుకుంటోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో తప్పనిసరగా ఒక కాలేజీ ఉండాలన్న లక్ష్యం పెట్టుకుని మొత్తం 30 చోట్ల కాలేజీల ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇప్పటికే 20 చోట్ల స్థలాల ఎంపిక పూర్తి కాగా.. మిగిలిన చోట్ల భూ సేకరణ.. అనువైన స్థలాలను ఖరారు చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తిండి పెట్టలేని.. ఉద్యోగాలు చూపలేని చదువులకు బదులు.. విద్యార్థుల్లో వారి వారి శక్తి సామర్థ్యాలు.. ఆసక్తి మేరకు  నైపుణ్యాలను మెరగుపరచి స్వశక్తిపై ఆధారపడి జీవించేలా తీర్చిదిద్దేందుకు నైపుణ్యాభివృద్ధి కాలేజీలను  ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే.

విద్యాశాఖలో తన ఆదేశాలు ఎంత మేరకు అమలవుతున్నాయో తెలుసుకునేందుకు సీఎం వైయస్‌.జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఇవాళ సమీక్ష నిర్వహించారు. మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి సహా, ప్రిన్సిపల్‌  సెక్రటరీ జి.అనంతరాము, స్పెషల్‌ సెక్రటరీ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్జా శ్రీకాంత్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌ చల్లా మధుసూదన్‌ రెడ్డి.. ఇతర అధికారులు హాజరయ్యారు.  ఈ కాలేజీల ద్వారా ఉత్తమ, నాణ్యమైన మానవ వనరులను పరిశ్రమలకు అందించాలని.. పారిశ్రామికాభివృద్దిలో ఈ కాలేజీలు కీలక పాత్ర పోషిస్తాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాలేజీల ఏర్పాటు వివరాలను ఆరా తీశారు. దాదాపు 20 చోట్ల స్థలాల గుర్తింపు పూర్తయిందని.. మిగిలిన చోట్ల కూడా చురుగ్గా స్థలాల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని అధికారులు వివరించారు. కాలేజీల నిర్మాణానికి స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. భవనాల నిర్మాణం అత్యంత నాణ్యంగా ఉండాలని, అంతేకాదు ఆకర్షణీయంగా కూడా తీర్చిదిద్దాలని అధికారులకు సూచనలిచ్చారు. అలాగే  స్కిల్‌  డెవలప్‌ మెంట్‌ కాలేజీల్లో కోర్సులు, పాఠ్య ప్రణాళిక తయారీ ఎంతవరకు వచ్చిందని  ఆరా తీశారు.

సిలబస్ రెడీ చేశామని.. ఫినిషింగ్‌ స్కిల్‌ కోర్సులు, ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు.. ఇలా రెండు రకాలుగా స్కిల్‌ కాలేజీల్లో శిక్షణ ఇచ్చేలా రూపొందించామన్నారు. మొత్తం 162కిపైగా కోర్సులను ఈ కాలేజీల్లో అందుబాటులో ఉంటాయని.. ఇందులో 127 కోర్సులు ఫినిషింగ్‌ స్కిల్స్, 35 ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు ఉంటాయని అధికారులు వివరించారు. పరిశ్రమల అవసరాలపై సర్వే, ఆ సర్వే ప్రకారం కోర్సులను నిర్ణయించామని.. సిలబస్ తయారీలో 4 అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం తీసుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు. సింగపూర్‌ పాలిటెక్నిక్, జీఐజెడ్, వాన్‌  హాల్‌ లారెన్‌స్టెన్‌ (యూనివర్శిటీ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌), డిపార్ట్‌ మెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ భాగస్వామ్యాన్ని తీసుకున్నామన్నారు. మరో 23 ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యం, వారితో ఎంఓయూలకు సిద్ధమయ్యామని, మరో 35 సంస్థలతో చర్చలు నడుస్తున్నాయని అధికారులు వివరించారు. కాలేజీల్లో నాణ్యమైన ల్యాబ్‌ ల ఏర్పాటుతోపాటు సిలబస్ లో కూడా వీరి సహకారం తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకు ఎంఓయూలకు సిద్ధమైన వాటిలో డెల్, హెచ్‌పీ, టీసీఎస్, ఐబీఎం, బియోకాన్, టాటా తదితర కంపెనీలు ఉన్నాయని వివరించారు.

వ్యవసాయంలో ఉపయోగించే యంత్రాల వినియోగం, వాటి మరమ్మతులపైనా శిక్షణకు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. ఆర్థికశాఖ అధికారులతో కూర్చుని నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని పనులు త్వరగా మొదలుపెట్టాలని ఆదేశించారు.  హై ఎండ్‌ స్కిల్స్‌తోపాటు  ప్రతి కాలేజీలో కూడా ఏసీలు, ప్లంబింగ్, భవన నిర్మాణం తదితర పనులపైన యువతకు శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచనలిచ్చారు.