గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 30 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత

గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 30 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత

తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో ఈ మధ్య కాలంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు  అధికమయ్యాయి. ఇటీవల నిజామాబాద్ భీంగల్ కస్తూర్భా గాంధీ స్కూల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన ఘటన మరవకముందే..మరో ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. 

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది.  మధ్యాహ్న భోజనం సమయంలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లుగా తెలుస్తోంది. స్కూల్లో మధ్యాహ్నం టమాటా చారుతో అన్నం తిన్న విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. ఆ తర్వాత తీవ్ర కడుపునొప్పితో బాధపడ్డారు.  30 మంది విద్యార్థులు కడుపు పట్టుకుని గిల గిలా కొట్టుకున్నారు. దీంతో  వారిని వెంటనే  అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి  తరలించి వైద్యం అందిస్తున్నారు. 

విద్యార్థినిలు అన్నం తిన్న తర్వాత కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డారు. వారి  పరిస్థితి గమనించిన  సిబ్బంది.. వెంటనే మన్ననూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అచ్చంపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ముందు జాగ్రత్తగా స్కూల్‌లోని మొత్తం 300 మంది విద్యార్థులను ప్రత్యేక అంబులెన్స్‌ల్లో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం  అస్వస్థతకు గురైన 30 మందిలో 10 మంది బాలికలు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.  దీంతో వారికి కృత్రిమ శ్వాస అందిస్తున్నారు.  బాలికల పరిస్థితిని డీటీడీవో పర్యవేక్షిస్తున్నారు.

 మరోవైపు గిరిజన బాలికల హాస్టల్లో  వార్డెన్‌ లేకపోవడంపై విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  స్థానికులతో కలిసి శ్రీశైలం హైవేపై  నిరసనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం, బాలికల ఆశ్రమ పాఠశాల అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  దీంతో శ్రీశైలం హైవేపై  కొద్దిసేపు ట్రాఫిక్‌ జామ్ అయింది.