- విలువ సుమారు రూ.2వేల కోట్లు
- ఐదుగురు విదేశీయులు అరెస్ట్
- ప్యాకెట్లపై పాకిస్తానీ కంపెనీ పేరు
- ఎన్సీబీ అధికారుల దర్యాప్తు
గుజరాత్ తీరంలో అధికారులు 3,300 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో రూ.1,300 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.
పోరుబందర్/న్యూఢిల్లీ: గుజరాత్ తీరంలో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), నేవీ అధికారులు, గుజరాత్ పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో భారీగా డ్రగ్స్ దొరికింది. 3,300 కిలోలు ఉన్న ఈ డ్రగ్స్ విలువ.. బహిరంగ మార్కెట్లో రూ.2,000 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఐదుగురు విదేశీయులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ పడవ ఇరాన్లోని చాబహార్ పోర్టు నుంచి వచ్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
డ్రగ్స్ ప్యాకెట్లపై ‘రాస్ అవద్ గూడ్స్ కంపెనీ, ప్రొడ్యూస్ ఆఫ్ పాకిస్తాన్’ అని రాసి ఉందని ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ మీడియాకు వెల్లడించారు. ‘‘మంగళవారం ఉదయం ఇండియన్ కోస్టల్ ఏరియాలోకి ఓ అనుమానాస్పద నౌక ప్రవేశించింది. వెంటనే నేవీ అధికారులు అప్రమత్తమై.. సముద్ర నిఘా విమానం, యుద్ధ నౌక, హెలికాప్టర్లు నౌకను చుట్టుముట్టాయి. బోట్ను పరిశీలించగా 3,300 కిలోల డ్రగ్స్ ప్యాకెట్లు దొరికాయి. వీటిలో 3,089 కేజీల చరాస్, 158 కేజీల మెథామెఫ్తమైన్, 25 కేజీల మార్ఫిన్ ఉన్నాయి. ఐదుగురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నాం’’ అని వెల్లడించారు.
శాటిలైట్ ఫోన్, నాలుగు సెల్ఫోన్లు సీజ్
ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎప్పుడూ పట్టుబడలేదని ఎన్సీబీ డీజీ ప్రధాన్ తెలిపారు. 2023, మేలో కేరళ తీరంలో ఒకేసారి 2,500 కిలోల డ్రగ్స్ను పట్టుకున్నట్లు గుర్తుచేశారు. స్మగ్లర్లు, డ్రగ్స్ ఆపరేటర్లు అరేబియా సముద్రంలోని ఇండియా జలాల ద్వారా డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని తెలిపారు. ఫిషింగ్ బోటును పోరుబందర్కు తరలించామన్నారు. అరెస్ట్ చేసిన వారు పాకిస్తాన్ లేదా ఇరాన్కు చెందినవారై ఉంటారని తెలిపారు. శాటిలైట్ ఫోన్, నాలుగు సెల్ఫోన్లు సీజ్ చేశామని తెలిపారు.