హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం రిజర్వాయర్పై ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 34 టీఎంసీలు మాత్రమే తరలించాలని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పింది. బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్లూడీటీ–1) ప్రకారం శ్రీశైలం కుడి కాల్వకు 19, చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీల కేటాయింపులు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసింది. కేఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్ అమలులో భాగంగా సీడబ్ల్యూసీ జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల రూల్ కర్వ్స్ రూపొందించి కేఆర్ఎంబీకి పంపించింది. గెజిట్లోని అన్ని ఔట్లెట్లకు సంబంధించిన ఆపరేషనల్ ప్రోటోకాల్పై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమే కృష్ణా నీటి పంపకాలు అమలవుతున్నాయని, బ్రజేశ్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–-2) అమల్లోకి వచ్చే వరకు మొదటి ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారమే రూల్ కర్వ్స్ రూపొందించాలని పట్టుబట్టింది. దీంతో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల రూల్ కర్వ్స్ను సీడబ్ల్యూసీ రూపొందించింది. ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కృష్ణా బోర్డు ఈనెల మొదటి వారంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పరిశీలనకు పంపింది. వీటిపై రాష్ట్రాలు తమ అభిప్రాయాలు చెప్తే బోర్డు సమావేశం నిర్వహించి రూల్ కర్వ్స్ ఫైనలైజ్
చేద్దామని సూచించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు రాసిన లెటర్లో బోర్డు పేర్కొంది.
46 టీఎంసీలు క్యారీ ఓవర్ గా ఉంచాలి
జూన్, జులై నెలల్లో సాగు నీటి అవసరాల కోసం శ్రీశైలంలో మినిమం డ్రా లెవెల్ 854 టీఎంసీలకు ఎగువన కనీసం 45 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు గోదావరి నది నుంచి మళ్లించే 45 టీఎంసీలకు ప్రత్యామ్నాయంగా నాగార్జునసాగర్లో 46.6 టీఎంసీలు క్యారీ ఓవర్ కోసం ఉంచాలని ప్రతిపాదించారు. రెండు రిజర్వాయర్లలో కలిపి 91.6 టీఎంసీలు నిల్వ చేయాలని, ఆ నీటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని పేర్కొన్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు కరెంట్ ఉత్పత్తి ద్వారా నీటిని విడుదల చేయాలని సూచించారు.
రూల్ కర్వ్స్ ఇలా..
బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ (గోరకల్లు, అవుకు రిజర్వాయర్లకు)కు 19 టీఎంసీలు, చెన్నై తాగునీటికి (జులై 1 నుంచి అక్టోబర్ 31 వరకు) 15 టీఎంసీలు, ఆవిరి నష్టం 33 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవాలని డ్రాఫ్ట్లో పేర్కొన్నారు. నాగార్జునసాగర్లో వానాకాలం పంట సీజన్కు 213.88 టీఎంసీలు, యాసంగి సీజన్కు 50.11 టీఎంసీలు, ఆవిరి నష్టాలు 16 టీఎంసీలు, పులిచింతల అవసరాలకు 9 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 5.7 టీఎంసీలు కలిపి మొత్తం 294.7 టీఎంసీలు వినియోగించుకోవాలని ప్రతిపాదించారు. కృష్ణా డెల్టా సిస్టం కింద మొదటి పంటకు 161.9 టీఎంసీలు, రెండో పంటకు 5.82 టీఎంసీలు, గ్రీన్ మాన్యూర్, నావిగేషన్, టౌన్ వాటర్ సప్లయ్ ఇతర అవసరాలకు 9.48 టీఎంసీలు, ఆవిరి నష్టాలకు 4 టీఎంసీలు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. కృష్ణా డెల్టాకు గోదావరి నుంచి 80 టీఎంసీలు, పులిచింతల నుంచి 9 టీఎంసీలు, భీమా లిఫ్ట్ స్కీం ద్వారా మళ్లించే 20 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తీసుకునే అవకాశం ఉందన్నారు. కృష్ణాకు ఉపనది తుంగభద్ర ఆధారిత ప్రాజెక్టుల కేటాయింపులనూ రూల్ కర్వ్స్లో పేర్కొన్నారు. కర్నూల్ కడప కెనాల్కు 31.90, తుంగభద్ర రైట్బ్యాంక్ లో లెవెల్ కెనాల్కు 29.50, హైలెవెల్ కెనాల్కు 32.50, ఆర్డీఎస్కు 15.90 టీఎంసీల కేటాయింపులున్నాయని తెలిపారు.