హైదరాబాద్/శంషాబాద్, వెలుగు: గ్రేటర్పరిధిలో రూ.83 కోట్లతో 36 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పారు. కాటేదాన్ లో కొత్తగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో కలిసి సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 7 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను అందుబాటులోకి తెచ్చామన్నారు. మరో 22 బ్రిడ్జిల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని వెల్లడించారు. అందుబాటులోకి వచ్చిన ఫుట్ఓవర్బ్రిడ్జిని కాటేదాన్ ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు.
పాదచారుల కోసం రూ.33కోట్ల అంచనాతో 12 జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వాటి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మైలార్ దేవులపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ జగన్, చార్మినార్ జోన్ ఎస్ సీ నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అప్పా చెరువు నుంచి నేషనల్హైవే 44 వరకు నిర్మిస్తున్న బాక్స్ డ్రెయిన్ పనులను మేయర్ పరిశీలించారు.