కరోనా డ్యూటీలో చనిపోయిన డాక్టర్లను మరిచారా?

కరోనా డ్యూటీలో చనిపోయిన డాక్టర్లను మరిచారా?

కేంద్రంపై ఐఎంఏ సీరియస్

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో ముందుండి సేవలు అందిస్తూ మృతి చెందిన డాక్టర్ల సేవలను మరిచారా అంటూ కేంద్రంపై ఇండియన్ మెడికిల్ అసోసియేషన్ సీరియస్ అయ్యింది. కరో్నా వైరస్‌‌పై పార్లమెంట్‌‌లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ ఇచ్చిన స్టేట్‌‌మెంట్‌‌లో ఆపత్కాలంలో విధులు నిర్వహిస్తూ చనిపోయిన డాక్టర్ల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై ఐఎంఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతి చెందిన డాక్టర్లకు సంబంధించిన సమాచారం కేంద్రం వద్ద లేదని, హెల్త్ విషయం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి చెప్పారు. మంత్రుల వ్యాఖ్యలు ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోందని, వీరుల త్యాగాలను గుర్తించలేదంటూ మండిపడిన ఐఎంఏ.. అంటువ్యాధి చట్టం 1897, విపత్తు నిర్వహణ చట్టాలను నిర్వహించే నైతిక అధికారాన్ని ప్రభుత్వం కోల్పోయిందని విమర్శించింది. కరోనా టైమ్‌‌లో విధులు నిర్వహిస్తూ 382 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని ఐఎంఏ తెలిపింది. వీరిలో అత్యంత పిన్న వయస్కుడైన డాక్టర్ వయస్సు 27 అని, అత్యధిక వయస్సు 58 ఏళ్లు అని పేర్కొంది. కరోనా సమయంలో ఇండియాలో చనిపోయినంతగా.. మరే దేశం కూడా డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్స్‌‌‌ను కోల్పోలేదని ఐఎంఏ స్పష్టం చేసింది.