కృష్ణా జిల్లాలోని చల్లపల్లి బీసీ హాస్టల్లో దారుణం జరిగింది. మూడో తరగతి విద్యార్థి ఆదిత్య అనుమానాస్పదంగా మృతి చెందారు. బాత్రూంలో రక్తపు మడుగులో ఆదిత్య మృతదేహం పడి ఉంది. హాస్టల్ సిబ్బంది సమచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చర్లపల్లి నారాయణనగర్కు చెందిన ఆదిత్య అన్న కూడా ఇదే హాస్టల్ లో ఉంటున్నాడు. రోజు అన్న పక్కనే పడుకునే ఆదిత్య సోమవారం రాత్రి అతని గదికి రాలేదు. దీంతో పక్క గదిలో ఉన్నాడనుకున్నాడు అన్న. మంగళవారం ఉదయం చూసే సరికి ఆదిత్య బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. గొంతు కింద కోసి ఉండడంతో ఆదిత్యను ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హాస్టల్ వార్డెన్తో పాటు తోటి విద్యార్థులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. కొడుకు చనిపోయాడని తెలియడంతో ఆదిత్య తల్లిదండ్రులు హాస్టల్కు చేరుకొని కన్నీరుమున్నీరవుతున్నారు.