తెలంగాణ వ్యాప్తంగా మూడో ఫేజ్ పంచాయతీ ఎన్నిలకు పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల మినహా చాలా చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలపై బీ ఆర్ఎస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఈర్యతో పాటు నాలుగురు కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇరు వర్గాల తోపులాటలో బోరింగ్ తండాకు చెందిన భూక్య స్వాతి అనే మహిళకు తీవ్ర గాయాలు. కాంగ్రెస్ కార్యకర్తల రెండు సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు బీఆర్ఎస్ లీడర్లు. ఘటన స్థలానికి సిఐ సూర్యప్రకాష్ చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన కాంగ్రెసు కార్యకర్తలను పంచాయతీ రాజ్ రూరల్ డెవలమెంట్ మెంబర్, కాంగ్రెసు.. పార్టీ నేత..చల్లా నారాయణరెడ్డి పరామర్శించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 11 గ్రామ పంచాయతీలు, 116 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ప్రస్తుతం 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది క్యాండిడేట్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.
