- కరోనా టైమ్లోనూ.. సంపద పెరిగింది!
- దేశంలో ఫస్ట్ అంబానీ, సెకెండ్ అదానీ
- గ్లోబల్ రిచెస్ట్ పర్సన్గా ఎలాన్ మస్క్ తరువాతి స్థానం అమెజాన్ జెఫ్ బెజోస్ది
- వెల్లడించిన హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్
- 2020లో కొత్తగా 40 మంది బిలినియర్స్ క్లబ్లోకి..
కరోనాకాలంలో జనం జేబు ఖాళీ అయినప్పటికీ, ఇండస్ట్రియలిస్టులు మాత్రం సంపదను అమాంతం పెంచుకున్నారు. వారి రంగాల్లో అద్భుత విజయాలు సాధించారు. కేవలం 2020లోనే 40 మంది ఇండస్ట్రియలిస్టులు రూ.100 కోట్లకుపైగా ఆర్జించి, బిలినియర్స్గా ఎదిగారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది వ్యాపారవేత్తల నెట్వర్త్ విపరీతంగా పెరిగింది.వీరిలో ఎక్కువ మంది ఫార్మారంగానికి చెందినవారే ఉన్నారు. అయితే ప్రపంచంలో అత్యధికంగా బిలినియర్స్ ఉన్న దేశంగా చైనా రికార్డు కొట్టింది.
ముంబై: కరోనా కష్టకాలంలోనూ మనదేశంలో 40 మంది బిలినియర్లుగా ఎదిగారు. గత ఏడాదిలోనే వీరంతా రూ.వంద కోట్లకుపైగా సంపాదించారు. దీంతో మనదేశంలో బిలినియర్ల క్లబ్లోకి ప్రవేశించిన వారి సంఖ్య 177కు చేరింది. వీరిలో 1,2 ర్యాంకుల్లో అంబానీ, అదానీలు నిలిచారు. హురూన్ గ్లోబల్ రిచ్ ఇండెక్స్ ప్రకారం.. రిలయన్స్ బాస్ ముకేశ్ అంబానీ 83 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.6.09 లక్షల కోట్లు) సంపదతో మనదేశంలో అత్యంత సంపన్నుడిగా రికార్డును కొనసాగించారు. ఆయన సంపాదన గత ఏడాది 24 శాతం పెరిగింది. అంతేగాక, ప్రపంచంలోని అత్యధిక సంపన్నుల్లో ఎనిమిదో వ్యక్తిగా నిలిచారు. అదానీ గ్రూప్ చైర్మన్, మరో గుజరాతీ గౌతమ్ అదానీ సంపద కూడా 2020 లో రెట్టింపు అయి దాదాపు 32 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.2.34 లక్షల కోట్లకు) చేరింది. గ్లోబల్ రిచెస్ట్ పీపుల్ క్లబ్లో ఆయన 20 స్థానాలు పైకి ఎదిగి ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో 48 వ వ్యక్తిగా మారారు. మనదేశంలో మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్ లిస్టులో రెండోస్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ నెట్వర్త్ 128 శాతం పెరిగి 9.8 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.72 వేల కోట్లు) చేరుకుంది. హురూన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనాస్ రెహ్మాన్ జునైద్ మాట్లాడుతూ అమెరికా, చైనాలో టెక్ కంపెనీల అధిపతులు సంపదను పెంచుకున్నారని, మనదేశంలో సంప్రదాయ, సైక్లికల్ ఇండస్ట్రీల అధిపతులు బిలినియర్లుగా ఎదుగుతున్నారని అన్నారు. .
ఇండెక్స్ హైలెట్స్:
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 197 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డు కొట్టారు. గత ఏడాది ఆయన సంపద 328 శాతం పెరిగింది. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ 189 బిలియన్ డాలర్లతో రెండోప్లేసులో ఉన్నారు. ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ ఎల్వీఎంహెచ్ బాస్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 114 బిలియన్ డాలర్ల సంపదతో మూడో ర్యాంకు సాధించారు. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్, ఫేస్బుక్ సీఈఓ జుకర్బర్గ్ వరుసగా 4,5 ర్యాంకులు సాధించారు.
ప్రపంచంలోని బిలినియర్లలో ఇండియన్ల సంఖ్య 209 కాగా, వీరిలో 177 మంది మనదేశంలో ఉంటున్నారు. గత ఏడాదిలో అమెరికా నుంచి 69 మంది బిలినియర్లు రాగా, భారత్లో 40 మంది ఈ క్లబ్లో చేరారు.
ఐటీ కంపెనీ హెచ్సీఎల్ ఫౌండర్ శివ్ నాడార్ 27 బిలియన్ డాలర్ల సంపదతో (రూ.1.94 లక్షల కోట్లు) దేశంలోనే మూడో రిచెస్ట్ పర్సన్గా నిలిచారు. సాఫ్ట్వేర్ కంపెనీ స్కేలర్కు చెందిన జై చౌదరి సంపద 274 శాతం పెరిగి 13 బిలియన్ డాలర్లకు చేరింది. ఎడ్యుటెక్ బైజూస్ రవీంద్రన్ కుటుంబం సంపద 100 శాతం పెరిగి 2.8 బిలియన్ డాలర్లకు
చేరుకుంది.
మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా కుటుంబం సంపద కూడా100 శాతం పెరిగి 2.4 బిలియన్ డాలర్లకు చేరింది. పతంజలి గ్రూప్ కు చెందిన ఆచార్య బాలకృష్ణ సంపద 32 శాతం తగ్గి 3.6 బిలియన్ డాలర్లుగా రికార్డయింది.
మహిళా ఇండస్ట్రియలిస్టుల్లో బయోకాన్కు చెందిన కిరణ్ మజుందార్ షా నెట్వర్త్ 4.8 బిలియన్ డాలర్లకు (41 శాతం పెరిగి) ఎగిసింది. గోద్రేజ్కు చెందిన స్మితా కృష్ణ సంపద 4.7 బిలియన్ డాలర్లకు చేరింది ఫార్మా కంపెనీ లుపిన్కు చెందిన మంజు గుప్తా దగ్గరున్న సంపద 3.3 బిలియన్ డాలర్లకు
దూసుకెళ్లింది.
బిలియనీర్ క్లబ్లో 10 మంది తెలుగువాళ్లు
1. దివి మురళి: హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ దివీస్ లాబొరేటరీ అధిపతి మురళి దివి, ఆయన కుటుంబ సంపాదన రూ.54,100 కోట్ల రూపాయలకు చేరింది. భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 20 వ స్థానంలో ఉండగా, ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 385 వ స్థానంలో ఉన్నారు.
2. పీవీ రాంప్రసాద్ రెడ్డి: అరబిందో ఫార్మా అధిపతి రాంప్రసాద్ రెడ్డి నెట్వర్త్ రూ .22,600 కోట్లకు ఎగిసింది. ఇండియాలోని అత్యంత సంపన్నుల్లో ఆయన ర్యాంకు 56కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల జాబితాలో 1,096 వ స్థానంలో ఉన్నారు.
3 .బి.పార్థసారధి: హెటిరో డ్రగ్స్ అధిపతి పి.పార్థసారధి రెడ్డి రూ.16 వేల కోట్లతో తొలిసారిగా హురూన్ లిస్టులో చేరారు. భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 83 వ స్థానంలో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల జాబితాలో 1,609 వ స్థానంలో ఉన్నారు.
4. కె. సతీష్ రెడ్డి: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్కు చెందిన సతీశ్ రెడ్డి మనదేశంలోని అత్యంత సంపన్నుల లిస్టులో 108 ర్యాంకుకు ఎగిశారు. ప్రపంచంలోని మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్ లిస్టులో ఆయన ర్యాంకు 2,050. సతీశ్ రెడ్డి సంపద రూ12,800 కోట్లకు చేరింది.
5. జీవీ ప్రసాద్, అనురాధ (డాక్టర్ రెడ్డీస్): వీళ్లిద్దరి నెట్వర్త్ రూ .10,70 0 కోట్లకు చేరింది. ఇండియాలోని అత్యంత సంపన్నుల జాబితాలో 133 వ స్థానం లో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల జాబితాలో 2,238వ ర్యాంకులో నిలిచారు.
6. పి పిచ్చి రెడ్డి (మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్): మనదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో పిచ్చిరెడ్డి 134 వ స్థానంలో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల లిస్టులలో 2,383వ ప్లేసులో ఉన్నారు. ఆయన నెట్వర్త్ విలువ రూ. 10,600 కోట్లుగా తేలింది.
7. జూపల్లి రామేశ్వర్ రావు (మై హోమ్ ఇండస్ట్రీస్): ఇండియాలోని అత్యంత సంపన్నుల్లో రామేశ్వర్ రావుది 83 వ స్థానం. ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల జాబితాలో 1,609వ ర్యాంకు సాధించారు. ఈ ఇండస్ట్రియలిస్టు నెట్వర్త్ రూ .10,500 కోట్లు.
8. పి వి కృష్ణారెడ్డి (మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్): భారతదేశంలోని అత్యంత సంపన్నుల లిస్టులో ఆయన ర్యాంకు 140కి చేరింది. ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో 2,383వ ర్యాంకు సాధించారు. కృష్ణారెడ్డి సంపద విలువ రూ. రూ .10,200 కోట్లకు చేరింది.
9. ఎం. సత్యనారాయణ రెడ్డి ఫ్యామిలీ (ఎంఎస్ఎన్ లాబొరేటరీస్): ఇండియాలోని అత్యంత సంపన్నుల జాబితాలో 143 వ ప్లేసులో ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన స్థానం 2,530. నెట్వర్త్ రూ .9,800 కోట్లకు చేరింది.
10. వీసీ నన్నపనేని (నాట్కో ఫార్మా): మనదేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో నన్నపనేనిది 164 వ స్థానం కాగా, ప్రపంచవ్యాప్తంగా రిచెస్ట్ పర్సన్ లిస్టులో 2,686 ర్యాంకు వచ్చింది. ఆయన నెట్వర్త్ రూ .8,600 కోట్లు.