ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మరికొన్ని గంటల్లో నాలుగో టీ20 జరగనుంది. బుధవారం (జనవరి 28) ఇరు జట్ల మధ్య విశాఖపట్నం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ఇప్పటికే ఐదు మ్యాచ్ల సిరీస్ను 3–-0తో కైవసం చేసుకున్న సూర్యకుమార్ సేన బుధవారం (జనవరి 28) జరిగే నాలుగో టీ20లోనూ గెలిచి క్లీన్ స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇప్పటికే సిరీస్ కోల్పోయిన కివీస్ నాలుగో టీ20లో ఇండియాకు షాక్ ఇచ్చి ఎలాగైనా బోణీ కొట్టాలని కసరత్తులు చేస్తుంది. ప్రస్తుతం 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇండియా 3-0 ఆధిక్యంలో నిలిచింది. నాలుగో టీ20 బుధవారం (జనవరి 28) సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది.
సూపర్ ఫామ్ లో శాంసన్, కిషాన్, సూర్య:
అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ధనాధన్ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ముఖ్యంగా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 300 ప్లస్ స్ట్రైక్ రేట్తో రన్స్ రాబడుతుండటం విశేషం. 200 ప్లస్ టార్గెట్ను 15 ఓవర్లలో.. 150 పైచిలుకు లక్ష్యాన్ని పది ఓవర్లోనే ఛేజ్ చేయడం చూస్తుంటే, కివీస్ బౌలర్లకు ఈ మ్యాచ్లోనూ నిద్రలేకుండా చేసేలా కనిపిస్తోంది. నాలుగో టీ20లో ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు నాలుగో టీ 20లో రెస్ట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. పనిభారం కారణంగా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వైజాగ్ టీ20కు దూరం కానున్నాడు.
వైజాగ్ వాతావరం రిపోర్ట్స్:
అక్యూవెదర్ యాప్ ప్రకారం.. బుధవారం (జనవరి 28) ఉదయం ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. మధ్యాహ్నం తర్వాత ఉష్ణోగ్రత కొద్దిగా 27 డిగ్రీలకు పెరిగి సాయంత్రం 21 డిగ్రీలకు పడిపోతుంది. ఎలాంటి వర్ష సూచనలు మ్యాచ్ కు ఉండవు. నైట్ ఎక్కువగా మంచు పడేఅవకాశాలు ఉన్నాయి.
పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటే..?
పిచ్ విషయానికి వస్తే వైజాగ్ టీ20కు పరుగుల వరద ఖయాంగా కనిపిస్తుంది. సాధారణంగా ఇక్కడ వికెట్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్ లో హై స్కోరింగ్ అని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. మొదటి బ్యాటింగ్ సమయంలో పిచ్ కొంచెం నెమ్మదిగా ఉండి స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. రెండో ఇన్నింగ్స్ సమయంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
