
- రాజీవ్ యువ వికాసం కింద జూన్2న 5 లక్షల మందికి సాయం
ముదిగొండ, వెలుగు : ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో తాము పని చేస్తున్నామని, అందుకే భగవంతుడు తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నాడని, రాష్ట్రానికి ముందుగానే రుతుపవనాలు రావడమే ఇందుకు నిదర్శనమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేవుడి దయతో సమృద్ధిగా వర్షాలు కురిసి దండిగా పంటలు పండాలని ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలం యడవల్లి గ్రామంలో నిర్మిస్తున్న యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం, ముఖ మండపం, విశ్రాంతి భవనాలకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని, సంపద సృష్టించి ప్రజలకు పంచుతున్నామని చెప్పారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద జూన్ 2న 5 లక్షల మందికి రూ. 8 వేల కోట్లు అందించనున్నట్లు చెప్పారు. పేదలకు సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని తెలిపారు. ఐదేండ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని చెప్పారు.
ప్రతి ఎన్నికల ప్రచారం యడవల్లి నుంచే...
తాను ప్రతిసారి యడవల్లి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెడతానని భట్టి విక్రమార్క చెప్పారు. స్వామివారి ఆశీస్సులు, ప్రజల ఆదరణతో గెలిచి డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నానని తెలిపారు. యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 4.75 కోట్లు కేటాయించామని, ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అంతకుముందు భట్టి విక్రమార్కకు ముదిగొండ మండల కాంగ్రెస్ నేతలు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.
మహిళలు బోనాలు ఎత్తుకొని మంగళహారతులు ఇవ్వగా.. కాంగ్రెస్ నేతలు క్రేన్ సాయంతో భారీ గజమాల వేసి సత్కరించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భట్టి దంపతులు ఆలయ అర్చకులు నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి సతీమణి మల్లు నందిని, కుమారుడు మల్లు సూర్య విక్రమాదిత్య, వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసునాయక్, డీసీసీ ప్రెసిడెంట్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యం, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.