ఐదుగురు ఉల్ఫా టెర్రరిస్టుల అరెస్ట్

ఐదుగురు ఉల్ఫా టెర్రరిస్టుల అరెస్ట్

గౌహతి: అస్సాంలోని చౌరాడియా జిల్లాలో ఐదుగురు ఉల్ఫా టెర్రరిస్టులు పట్టుబడ్డారు. వారి నుంచి భారీ మొత్తంలో వెపన్స్, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి పోలీసులు గురువారం తెలిపారు. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చిన ఇంటి ఓనర్ ను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. అస్సాం సీఎం సర్బానంద సోనోవాల్ గురువారం జిల్లా పర్యటనకు ముందు సోదాలు నిర్వహించగా టెర్రిరిస్టుల ఆచూకీ తెలిసిందని.. పోలీసులు, ఇండియన్ ఆర్మీ జరిపిన సంయుక్త ఆపరేషన్ లో వారు తలదాచుకున్న గ్రామాన్ని చుట్టుముట్టి అరెస్టు చేసినట్లు ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ మీడియాతో చెప్పారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ బోర్డర్ లో ఉల్ఫా టెర్రరిస్టుల కదలికలపై సెక్యూరిటీ నిఘా పెంచినట్లు తెలిపారు.
అరెస్టయిన వారిలో అపుర్బా గొగోయి అలియాస్ అరోహన్ అసోమ్, బాంబులు తయారు చేయడంలో ఎక్స్ పర్ట్ సిమంతా గొగోయ్ అలియాస్ మైనా ఉన్నారని, హత్య, కిడ్నాప్, దోపిడీ కేసులకు సంబంధించి ఈ ఇద్దరూ ఇప్పటికే పోలీసుల వాంటెడ్ లిస్టులో ఉన్నారని తెలిపారు. మూడు రైఫిల్స్‌, 323 రౌండ్ల మందుగుండు సామగ్రి, రెండు పిస్టల్స్, జెలిటెన్ స్టిక్స్, పేలుడు పదార్థాలు, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.