ఏందీ రాజభోగం.. ఒక్క అధికార పర్యటనకు ఇన్ని ఏర్పాట్లా? ఇంతమంది సిబ్బంది కి బాధ్యతలా.. పర్యటనలో ప్రతిదీ వెరీ వెరీ స్పెషల్ గా ఉండాలంట.. పర్యటను ముగిసే తనకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఓ బీఎస్ ఎన్ ఎల్ డైరెక్టర్ ప్రయాగ్ రాజ్ ట్రిప్ కు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులను ఆదేశించిన అధికారిక లెటర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. నెటిజన్ల విమర్శలతో ఆయన ట్రిప్ వివాదాస్పదంగా మారింది.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) డైరెక్టర్ వివేక్ బంజాల్ ప్రయాగ్ రాజ్ పర్యటనకు సంబంధించిన హాస్పిటాలిటీ ప్రోటోకాల్ డాక్యుమెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఓ సాధారణ పర్యటనకు అధికారికి అందించిన విఐపీ అరెంజ్ మెంట్లను నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు.
రిసెప్సన్ లాజిస్టిక్స్ నుంచి ప్రయాగ్ రాజ్ సంగమ స్నానం, దేవాలయాల సందర్శన తర్వాత అతని పర్సనల్ కేర్ కోసం విస్తృతమైన ఏర్పాట్లకు సంబంధించిన డాక్యుమెంట్ లీక్ అయిన వెంటనే బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజాల్ ఫిబ్రవరి 25న జరగాల్సిన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ సంఘటనతో వీఐపీ కల్చర్, సీనియర్ అధికారులకోసం ప్రభుత్వ నిధులు వినియోగంపై చర్చనీయాంశమైంది.
మినిట్ టు మినిట్ ప్రాటోకాల్ పై రచ్చరచ్చ..
ఫిబ్రవరి 19న బీఎస్ ఎన్ ఎల్ డీజీఎం స్థాయి అధికారులు ఓ ఆర్డర్ పాస్ చేశారు. అది డైలీ లాజిస్టిక్స్ నుంచి దేవాలయాల సందర్భన వరకు బీఎస్ ఎన్ ఎల్ డైరెక్టర్ ప్రయాగ్ రాజ్ ట్రిప్ మినిట్ టు మినిట్ ప్రణాళికను కవర్ చేస్తుంది. త్రివేణి సంగమం ,సమీపంలోని దేవాలయాల్లో దర్శనం సహా, ప్రయాణంలో కావాల్సిన వస్తువులు, రిఫ్రెష్మెంట్లు, ఎస్కార్ట్ సేవలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆ లెటర్ లో ఆదేశించారు.
ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అధికారుల పర్యటలకు ప్రభుత్వ ధనం ఖర్చు చేస్తున్న తీరుపై పెద్ద చర్చ జరిగింది. దీనిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది రాయల్ ప్రోటోకాల్ అని పోస్ట్ లు పెట్టారు.
ఇక నెటిజన్ల విమర్శలు అధికారి దృష్టికి వెళ్లడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. డైరెక్టర్ తన ప్రయాగ్ రాజ్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు బీఎస్ ఎన్ ఎల్ అధికారులు తెలిపారు. అయితే ఆ ఏర్పాట్లపై స్పందించాలనికోరితే నిరాకరించడం గమనార్హం.
