ఎల్లూరు పంపులు రిపేర్లు చేయక 50 టీఎంసీలు లాస్​

ఎల్లూరు పంపులు రిపేర్లు చేయక 50 టీఎంసీలు లాస్​
  • 2021 నుంచి కల్వకుర్తి పంపుల్లో రెండు రెస్ట్​లోనే!
  • ఈ ఏడాది 20 టీఎంసీలు వృథా
  • కల్వకుర్తి కింద ఎండిన 500 చెరువులు
  • ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో సరిపడా తాగునీరు సరఫరా చేయలేని పరిస్థితి

నాగర్​కర్నూల్, వెలుగు: 2020లో నీటమునిగిన ఎల్లూరు పంపులకు రిపేర్లు చేయించడంలో గత బీఆర్ఎస్​సర్కారు చేసిన నిర్లక్ష్యం ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాపై పడింది. 2021 నుంచి రెండు పంపులను పక్కన పెట్టడంతో శ్రీశైలం నుంచి మూడేండ్లలో సుమారు 50 టీఎంసీలను లిఫ్ట్​ చేయలేని పరిస్థితి నెలకొన్నది. ఈసారి కృష్ణాకు వరద లేకపోవడంతో గతేడాది అక్టోబర్​30 నాటికే అప్పటి ప్రభుత్వం కేఎల్​ఐ పంపులను బంద్ ​పెట్టింది. దీంతో కల్వకర్తి లిఫ్ట్​ స్కీం కింద డిసెంబర్​ నాటికే 500 చెరువులు అడుగంటాయి. ఈ క్రమంలో యాసంగిలో 3.15 లక్షల ఎకరాలకు  క్రాఫ్​ హాలీడే ప్రకటించగా, అడపాదడపా పంటలు సాగుచేసిన రైతులు సగం పంటలను కూడా కాపాడుకోలేకపోయారు. ప్రస్తుతం శ్రీశైలం అడుగంటడంతో అనధికారికంగా ఎల్లూరు నుంచి ఒక పంపు ద్వారా 800 క్యూసెక్కుల చొప్పున  రెండు, మూడు రోజులకోసారి నీళ్లు లిఫ్ట్​ చేస్తున్నా 19 అసెంబ్లీ సెగ్మెంట్లలో తాగునీటి అవసరాలను తీర్చలేని పరిస్థితి ఏర్పడింది.

మూడేండ్లుగా రెండు పంపులే దిక్కు..

2020  అక్టోబర్​లో ఎల్లూరు పంప్​హౌజ్​ నీటమునిగింది. పాలమూరు- రంగారెడ్డి బ్లాస్టింగులే ఇందుకు కారణమనే ఆరోపణలు వచ్చాయి. పేలుడు ధాటికి బేస్​ నుంచి విడిపోయిన మూడో పంపు,   ప్రొటెక్షన్​ వాల్​ కూలి ఐదో పంపు దెబ్బతిన్నాయి. డీ వాటరింగ్, రిపేర్ల పేరుతో  రూ.3 కోట్లకుపైగా ఖర్చు చేశారు. మొదట పటేల్ కంపెనీకి , తర్వాత మెగా కంపెనీకి పనులు అప్పగించారు. వారు ఈపీపీఎల్​ సంస్థకు సబ్​లీజ్​కు ఇచ్చారు. సర్జ్​పూల్, పంప్​హౌజ్​ల మధ్య  ప్రొటెక్షన్ వాల్ బీటలు వారడంతో ఈ రెండు పంపులను వాడుకునే   ఛాన్స్​ లేదని మూడేండ్లుగా మూసేశారు. వాస్తవానికి ఎల్లూరు లిఫ్ట్​లో ఒక్కొక్కటి 800 క్యూసెక్కుల సామర్థ్యమున్న 5 పంపులున్నాయి. 

సరిగ్గా నడిపితే కృష్ణాకు వరద వచ్చే రెండు నెలల్లో ప్రతిరోజూ 4 వేల క్యూసెక్కుల నీటి చొప్పున 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే వీలుండేది. కానీ రెండు పంపులు దెబ్బతినడం, మూడో పంపును స్టాండ్​బైగా ఉంచడంతో మూడేండ్లుగా రోజుకు 1600 క్యూసెక్కుల నీటిని మాత్రమే ఎత్తిపోస్తున్నారు. ఈ రెండు పంపులతో 4.15 టీఎంసీ కెపాసిటీ ఉన్న నాలుగు రిజర్వాయర్లతో పాటు, మూడు జిల్లాల్లోని 500 చెరువులు నింపి  4.50లక్షల ఎకరాలకు సాగునీరిస్తున్నామని నాటి సర్కారు చెప్తూ వచ్చింది. కానీ వాస్తవంగా ఏ ఏడాది కూడా 25టీఎంసీలకు మించి ఎత్తిపోయలేదు. అంటే మూడేండ్లలో 50టీఎంసీల నీటిని వదిలేశారు. దీంతో ఏనాడూ సగం ఆయకట్టుకు నీళ్లిచ్చిన పాపానపోలేదు. 

అటు క్రాఫ్​ హాలీడే.. ఇటు తాగునీటి కష్టాలు

ఈసారి కృష్ణాకు ఆశించిన వరద లేకపోవడంతో కేఎల్ఐ కింద యాసంగి సాగునీరు ఇవ్వలేమనే నిర్ణయానికి వచ్చిన నాటి బీఆర్ఎస్​ ప్రభుత్వం అక్టోబర్ 30 నాటికి కేఎల్ఐ పంపులను అధికారంగా బంద్​పెట్టింది. నిజానికి  యాసంగిలో 3.15లక్షల ఎకరాల సాగునీరివ్వాల్సి ఉండగా, క్రాఫ్ ​హాలీడే ప్రకటించడంతో రైతులు 1.17లక్షల ఎకరాల్లో  పత్తి, మొక్క జొన్న, జొన్న తదితర పంటలు సాగుచేశారు. కానీ, చెరువులు అడుగంటడం,  భూగర్బజలాలు పడిపోవడంతో 30శాతానికి పైగా పంటలు ఎండిపోయాయి. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ డెడ్​స్టోరేజీకి చేరింది. తెలంగాణ ఇప్పటికే తన అవసరాల కోసం వాటాకు మించి వాడుకున్నదని ఏపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేఎల్​ఐ నుంచి అధికారికంగా భగీరథకు సైతం నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదు. దీంతో  ప్రస్తుతం తాగునీటి అవసరాల కోసం అనధికారికంగా కేఎల్ఐ ఫస్ట్ లిఫ్ట్ నుంచి ఒక మోటార్​ ద్వారా  క్యూసెక్కుల నీటిని  ఎల్లూరు వాటర్​గ్రిడ్​ద్వారా  గౌరిదేవిపల్లి, కల్వకుర్తి, కర్కల్ పహడ్, కమ్మదన,రాఘవాపూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు సప్లై చేస్తున్నారు. 

ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మిషన్​భగీరథకు ఈ నీళ్లే ఆధారం. 19 అసెంబ్లీ సెగ్మెంట్లు, 19 మున్సిపాలిటీలు, 3201  గ్రామాలకు తాగునీరు సరఫరా జరగాలి. కానీ, ఎల్లూరు నుంచి నీటిని ఎత్తిపోసుకోలేకపోవడం వల్ల చెరువులు ఎండిపోవడంతో   ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో భూగర్భజలాలు అడుగంటాయి. దీనికి తోడు వాటర్​గ్రిడ్​కు సరిపడా నీరందక తాగునీటి సమస్య మొదలైంది. తీవ్రమైన ఎండలు, ఆవిరి నష్టాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ నెల​ చివరి కల్లా ఎల్లూరు వద్ద కనీస నీటి మట్టం ఉండే ఛాన్స్​ లేదు. దీంతో మే నెలలో అటు ఉమ్మడి మహబూబ్​నగర్​, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి ఎద్దడి ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆఫీసర్లు తలపట్టుకుంటున్నారు.