హైదరాబాద్, వెలుగు: ఎక్సైజ్ శాఖ డీపీసీలో 53 మంది అధికారులకు ప్రమోషన్లు వచ్చాయి. డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) చైర్మన్ వికాస్ రాజ్, జేడీ కన్వీనర్ సెక్రటరీ బెనహార్ మహేశ్ దత్ ఎక్క, మెంబర్లు ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ఇండస్ట్రీయల్ సెక్రటరీ సంజయ్ కుమార్ సమావేశంలో 53 మంది ఎక్సైజ్ అధికారులకు పదోన్నతులకు సిఫార్సు చేశారు.
అడిషనల్ కమిషనర్లుగా ఇద్దరికి, జాయింట్ కమిషనర్లుగా ఇద్దరికి, డిప్యూటీ కమిషనర్లుగా 12 మందికి, అసిస్టెంట్ కమిషనర్లుగా 14 మందికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్లుగా 23 మందికి డీపీసీ ద్వారా ప్రమోషన్లు వచ్చాయి. పదోన్నతులు పొందిన అధికారులందరు మంగళవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కమిషనర్ను కలిసిన వారిలో అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, జాయింట్ కమిషనర్ సురేశ్ రాథోడ్, డిప్యూటీ కమిషనర్లు పి.దశరథ్ తదితరులు ఉన్నారు.
