చెన్నైకి త‌ర‌లిస్తున్న 546 కేజీల‌ గంజాయి ప‌ట్టివేత.. ఇద్ద‌రు అరెస్టు

చెన్నైకి త‌ర‌లిస్తున్న 546 కేజీల‌ గంజాయి ప‌ట్టివేత.. ఇద్ద‌రు అరెస్టు

విజ‌య‌వాడ మీదుగా రోడ్డు మార్గంలో త‌మిళ‌నాడు రాష్ట్రానికి అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న రూ.27.30ల‌క్ష‌లు విలువైన 546 కిలోల గంజాయిని విజ‌య‌వాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని త‌ర‌లిస్తున్న ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేసి , అక్ర‌మ ర‌వాణాకు ఉప‌యోగించిన‌ లారీని సీజ్ చేశారు.

నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో ఇటీవ‌ల విస్తృత దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో టాస్క్‌ఫోర్స్ ఏ.డి.సి.పి.కె.వి.శ్రీనివాసరావుకు అందిన ప‌క్కా సమాచారం మేరకు గురువారం విజయవాడ, నున్న పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రకాష్‌నగర్ సెంటర్ వద్ద వాహనాలను తనిఖీ చేప‌ట్టారు.

TN52D 3393 నెంబరు గల లారీలో తమిళనాడు రాష్ట్రం సాలెం జిల్లా పనమారతు పట్టి పోస్టుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఏలువలై వెంకటేష్(33 లారీ య‌జ‌మాని), లోకనాధం రాజేష్ కన్నా(30 లారీ క్లీన‌ర్) అక్ర‌మంగా గంజాయి ర‌వాణా చేస్తున్నారు. విశాఖ జిల్లా, యలమంచిలి హైవే వద్ద గంజాయిని లోడు చేసుకుని విజయవాడ మీదుగా తమిళనాడు రాష్ట్రానికి త‌ర‌లిస్తుండ‌గా పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించి వారిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా గంజాయి అక్ర‌మ ర‌వాణాను గుర్తించి నిరోధించ‌డంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌ర్చిన టాస్క్‌ఫోర్స్ అధికారులు, సిబ్బంది ఏ.సి.పి. వి.ఎస్.ఎన్.వర్మ, ఎస్‌ఐలు శ్రీనివాసరావు, రవితేజ, వెంకటేశ్వరరావు ల‌ను పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు అభినందించారు.