
- మొత్తం 9.32 లక్షల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు
- అక్టోబర్ 6-8 న ప్రాపర్టీ షో నిర్వహిస్తున్న నారెడ్కో తెలంగాణ
హైదరాబాద్, వెలుగు: గత 9 నెలల్లో రాష్ట్రంలో 9.32 లక్షల ప్రాపర్టీ (ఇందులో రెసిడెన్షియల్ తో అగ్రి కల్చరల్ భూములు కూడా కలిసున్నాయి) రిజిస్ట్రేషన్లు జరిగా య ని నారెడ్కో తెలంగాణ పేర్కొంది. అంటే రోజుకు 5,500 రిజిస్ట్రేషన్లు అయ్యాయని తెలిపింది.
గత ఐదు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా రూ. 7 వేల కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించింది. ఒక్క హైదరాబాద్ సిటీలోనే ఏడాదికి 36 వేల ఇండ్లు అమ్ముడవుతున్నాయని తెలిపింది. ఈ సంస్థ అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో సిటీలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ప్రాపర్టీ షో నిర్వహించనుంది.
కరోనా సందర్భంగా 2020 లో ప్రాపర్టీషో నిర్వహించలేకపోయామని నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ బీ సునీల్ చంద్రా రెడ్డి అన్నారు. ఈ ఏడాది నిర్వహించేది 13 వ ఎడిషన్ అని పేర్కొన్నారు. బిల్డర్లు, సప్లయర్లు, ఫైనాన్స్ సంస్థలు ఈ ఈవెంట్ లో పాల్గొంటాయని , పెద్ద సంఖ్యలో కస్టమర్లు వస్తారని అంచనా వేశారు. మొత్తం 110 స్టాల్స్ ఏర్పాటవుతాయని, రెరా రిజిస్ట్రేషన్ పొందిన ప్రాపర్టీలు మాత్రమే ప్రదర్శనలో ఉంటాయని వివరించారు.ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ ఎగ్జిబిషన్ ఓపెన్ లో ఉంటుంది.