
హైదరాబాద్ : డబ్బులకు కక్కుర్తిపడ్డ ఓ తండ్రి స్వయానా తన కూతురిని వృద్ధుడికి కట్టబెట్టాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో జరుగగా స్థానికంగా కలకలం రేపింది. ఓల్డ్ సిటీకి చెందిన ఎండీ గౌస్ అనే వ్యక్తి భార్య కొన్నాళ్ల క్రితం మృతి చెందడంతో.. మరో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఓ కూతురు ఉంది. ఆ అమ్మాయి వయసు ప్రస్తుతం 16 సంవత్సరాలు. అయితే సవతి తల్లి ఉన్నీషా, తండ్రి గౌస్ కలిసి ఆమెను ఓ 57 ఏళ్ల వృద్ధుడికిచ్చి పెళ్లి చేశారు.
ఆ వృద్దుడి నుంచి రూ. 1.50 లక్షలు తీసుకుని, డిసెంబర్ 27వ తేదీన బండ్లగూడలో వివాహం జరిపించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఎండీ గౌస్ ఇంటికి చేరుకుని పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివాహం చేసుకున్న వృద్ధుడు అబ్దుల్ లతీఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దందా నడుపుతున్న మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కేరళకు చెందిన వారని విచారణలో తేలిందన్నారు పోలీసులు.