
- 20 కంటే ఎక్కువ మంది పిల్లలున్న చోట ఏర్పాటు చేస్తం: సీఎం రేవంత్
- స్కూళ్లలో సౌలతుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తం
- సంక్షేమ శాఖ కింద ఉన్న విద్యాసంస్థలను రేషనలైజేషన్ చేయాలని అధికారులకు సూచన
హైదరాబాద్, వెలుగు: ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా 571 సర్కార్ స్కూళ్లను ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వీటిని గ్రామాలు, పట్టణాల్లో 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న ఏరియాల్లో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సర్కార్ బడుల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.
‘‘విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు స్కిల్స్ ఉండాలి. అందుకోసం విద్యావ్యవస్థలో మార్పులు చేయాలి. హైస్కూల్ స్థాయి నుంచే నైపుణ్య శిక్షణ ఇస్తే, భవిష్యత్తులో విద్యార్థులు తమకు ఇష్టమైన రంగంలో రాణించే అవకాశం ఉంటుంది. ప్రతి విద్యార్థికి ఉన్నతమైన విద్య అందించేందుకు మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సౌకర్యాల కల్పనకు ఎంత ఖర్చయినా చేస్తం. తెలంగాణలో పట్టణీకరణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో పురపాలక శాఖతో విద్యా శాఖ సమన్వయం చేసుకొని హెచ్ఎండీఏ, మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో స్కూళ్లను ఏర్పాటు చేయాలి” అని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విభాగాల కింద ఉన్న విద్యాసంస్థలను హేతుబద్ధీకరించి.. ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని సూచించారు.
స్కూళ్లలో గురుకుల సౌలతులు కల్పించండి..
నాణ్యమైన భోజనం, యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలతో గురుకులాలపై విద్యార్థుల ఆసక్తి పెరుగుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డే స్కాలర్స్కు కూడా గురుకుల సదుపాయాలు అందించే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు కుటుంబం, సమాజం ప్రాధాన్యతను వివరించడంతో పాటు వారి బాధ్యతలను తెలియజేసే కౌన్సెలింగ్ ఇస్తే.. మానసికంగా దృఢంగా, బాధ్యతాయుతమైన పౌరులుగా తయారవుతారని అన్నారు.
సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సీఎంవో సెక్రటరీలు అజిత్ రెడ్డి, మాణిక్ రాజ్, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ సెక్రటరీ శ్రీదేవసేన, ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య, స్కూల్ ఎడ్యుకేషన్ డైరె క్టర్ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.