AI దెబ్బకు మధ్యతరగతి జీవితాలు తలకిందులు.. ప్రమాదంలో మహిళలు!

AI దెబ్బకు మధ్యతరగతి జీవితాలు తలకిందులు.. ప్రమాదంలో మహిళలు!

సాంకేతిక విప్లవం ఒకప్పుడు ఒక సామాజిక వర్గాన్ని నిలబెడితే.. అదే టెక్నాలజీ ఇప్పుడు ఆ వర్గాన్ని నడిరోడ్డుపై నిలబెట్టేలా చేస్తోంది. గడచిన 2 దశాబ్దాలుగా భారతదేశంలో సాఫ్ట్‌వేర్ రంగం, ఐటీ ఉద్యోగాలు నయా మధ్యతరగతి పుట్టుకకు కారణమయ్యాయి. ఇంజనీరింగ్, డేటా సైన్స్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ లాంటి కొలువులు కేవలం ఆర్థిక ఎదుగుదలనే కాకుండా.. సమాజంలో హోదాని, స్థిరత్వాన్ని, కులాలకతీతంగా ఎదుగుదలను అందించాయి. బెంగళూరు, హైదరాబాద్, గుర్గావ్ లాంటి నగరాలు ఈ ఐటీ కలల ఆధారంగానే గ్లోబల్ హబ్‌లుగా మారాయి. కానీ ఇప్పుడు ఏఐ దూకుసు ఈ మధ్యతరగతి కలల కోటను బద్దలు కొడుతోంది.

గతంలో సాంకేతిక మార్పులు కేవలం శారీరక శ్రమతో కూడిన పనులకే పరిమితం కాగా.. ఏఐ ఇప్పుడు నేరుగా వైట్-కాలర్ ఉద్యోగాలపైనే దెబ్బకొడుతోంది. కోడింగ్ రాయడం, డేటా అనలిటిక్స్, రిపీటేటివ్ టాస్క్‌లు చేసే ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను ఏఐ అత్యంత వేగంగా రీప్లేస్ చేస్తోంది. ఫలితంగా గ్లోబల్ టెక్ దిగ్గజాలు భారీగా లే-ఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. అమెజాన్ వంటి సంస్థలు వేలాది మందిని తొలగించడమే దీనికి నిదర్శనం. కంపెనీలకు ఏఐ వల్ల ప్రొడక్టివిటీ పెరిగి, నిర్వహణ ఖర్చులు తగ్గుతుంటే.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు మాత్రం భవిష్యత్తు అంధకారంగా మారుతోంది. మెరిట్, స్కిల్స్ ఉన్నత వర్గంగా భావించుకున్న ఐటీ ప్రొఫెషనల్స్.. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో తమ ఉద్యోగ భద్రత ఎంత బలహీనమైనదో గ్రహిస్తున్నారు.

ఏఐ సృష్టిస్తున్న ఈ అస్థిరత వల్ల ప్రైవేట్ రంగంపై నమ్మకం సడలిపోతోంది. ప్రస్తుతం నిరుద్యోగిత రేటు పెరుగుతున్న వేళ.. మార్కెట్‌లో వేలాది మంది నైపుణ్యం గల సాంకేతిక నిపుణులు ఖాళీగా ఉంటున్నారు. దీంతో కార్పొరేట్ కంపెనీల దోపిడీ మరింత ఎక్కువవుతోంది. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి, ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివిన అభ్యర్థులు సైతం ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ కోసం సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రభుత్వ ఉద్యోగాల వైపుకు వెళుతున్నారు. సమాజంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే గౌరవం, ముఖ్యంగా పెళ్లిళ్ల మార్కెట్‌లో ఉండే డిమాండ్ కూడా ఈ ధోరణిని మరింత పెంచుతోంది.

ALSO READ : ఏఐని కంట్రోల్ చేయటం కష్టమేనా..?

ఏఐ సంక్షోభం వల్ల అత్యధికంగా నష్టపోయేది మహిళా ఉద్యోగులే. ఐటీ రంగం భారతదేశంలో కోట్లాది మంది మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని, ఇంటి వెలుపల గౌరవాన్ని ఇచ్చింది. అయితే మార్కెట్ ఒడిదొడుకులు వచ్చినప్పుడు మొదట టార్గెట్ అయ్యేది మహిళలే అనేది చారిత్రక సత్యం. ప్రస్తుతం ఏఐ రీప్లేస్ చేస్తున్న ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో మహిళల సంఖ్యే ఎక్కువ. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతే మధ్యతరగతి కుటుంబాలు ఆడపిల్లలకు చదువుపై డబ్బు ఖర్చు చేయటానికి వెనకాడతాయని నిపుణులు అంటున్నారు. ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోవడం వల్ల మహిళలు మళ్లీ చిన్న వయసులోనే పెళ్లిళ్లకు బలవంతం కావడం, సాంప్రదాయ గృహిణి పాత్రలకే పరిమితం కావడం జరుగుతుంది. రీస్కిల్లింగ్ దీనికి పరిష్కారంగా చెప్తున్నప్పటికీ, కుటుంబ బాధ్యతలు ఉండే మహిళలకు ఇది అంత ఈజీ కాదు.