సామాన్యుల నుంచి ఐటీ కంపెనీల వరకూ అందరూ సైబర్ నేరాల బారిన పడుతున్నారని సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ సెక్యూరిటీ కౌన్సిల్ వైస్ చైర్మన్ భరణి కుమార్ అన్నారు. దేశంలో దాదాపు 65 శాతం కంపెనీలు సైబర్ అటాక్స్కు గురవుతున్నాయని చెప్పారు.
మాదాపూర్ హెచ్ఐసీసీ నోవోటెల్లో సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 5.0 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో ఎస్సీఎస్సీ వైస్ చైర్మన్ భరణి కుమార్, మైక్రోసాఫ్ట్ ఎండీ, ఐడీసీ రాజీవ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు, ఐటీ ఉద్యోగులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ సెక్యూరిటీ కౌన్సిల్ వైస్ చైర్మన్ భరణి కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నారు. సామాన్యులే కాదు పెద్ద పెద్ద ఐటీ కంపెనీల డేటానూ సైబర్ నేరగాళ్లు చోరీ చేస్తున్నారని అన్నారాయన. గతంలో రాండ్సమ్ వేర్ వంటి పలు రకాల మాల్ వేర్స్ ద్వారా ఐటీ కంపనీల డేటా చోరీ జరిగిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు.
సైబర్ క్రైమ్స్తో పాటు మహిళలు భద్రత, సోషల్ మీడియాలో జరుగుతున్న నేరాలుపై కూడా కాన్ఫరెన్స్ నిర్వస్తున్నామని చెప్పారు భరణి కుమార్. గుర్తు తెలియని వ్యక్తులకు మన సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకుండా ఉండాలని కోరారు. సైబర్ నేరాలను నియంత్రించేందుకు సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. భవిష్యత్తులో సైబర్ నేరాలు, పరిష్కారాలపై నేటి యువత తెలుసుకుని, మరింత మందికి అవగాహన కల్పించాలని చెప్పారు.

