దారుణం: పంచకులలో 70 గోవులు మృతి.. విష ప్రయోగమని అనుమానం

దారుణం: పంచకులలో 70 గోవులు మృతి.. విష ప్రయోగమని అనుమానం

పంచకుల: హర్యానా, పంచకులలోని మాతా మానస దేవి గోధామంలో పదుల సంఖ్యలో గోవులు చనిపోయాయి. దాదాపు 70 వరకు గోవులు మృతి చెందగా.. 30 వరకు ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. గోవుల మృతికి ఫుడ్ పాయిజనింగ్ కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో హర్యానా విధాన సభ స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తా విచారణకు ఆదేశించారు. మానస దేవి గోధామంలో 7 షెడ్లలో 1,500కు పైగా గోవులు ఉన్నాయి. అందులోని రెండు, మూడో షెడ్లలో 550 గోవులు ఉండగా.. వాటిలో 70 చనిపోగా, 30 ఆవుల పరిస్థితి విషమంగా ఉంది.

‘గత రాత్రి రెండు ఎడ్లు కొట్టుకోవడాన్ని వర్కర్స్ గమనించారు. అదే సమయంలో పదుల కొద్దీ ఆవుల నోట్లో నుంచి నురుగు వచ్చి అవి పడిపోయాయి. వెంటనే సమాచారం ఇవ్వడంతో హర్యానా యానిమల్ హజ్బెండరీ డిపార్ట్‌‌మెంట్ ఇక్కడకు చేరుకొని 30 గోవులను కాపాడింది. ఇవ్వాళ ఉదయం లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్, హిస్సార్ నుంచి మరో వైద్య బృందం ఇక్కడకు వచ్చింది’ అని పంచకుల గోషాల ట్రస్టు జనరల్ సెక్రటరీ డాక్టర్ నరేశ్ మిఠ్ఠల్ చెప్పారు. గోవుల పాయిజనింగ్‌‌ గురించి తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని మిఠ్ఠల్ పేర్కొన్నారు.