హైదరాబాద్, వెలుగు: నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో ఆధార్ కార్డు అప్డేట్ చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితులు సిటీకి చెందిన నితీష్ సింగ్(30), సయ్యద్ ముస్తఫా(28), రబ్బాని(28), అజ్హర్ షరీఫ్(27), మహ్మద్ సొహైల్(23),షేక్ జహంగీర్ పాష(37), అన్వరుద్ధీన్(34), మహ్మద్ అహ్మద్(20)గా గుర్తించారు.
ఫేక్ అడ్రస్, పెన్షన్ కోసం ఏజ్ చేంజ్
బోరబండకు చెందిన నితీష్ సింగ్.. మధ్యప్రదేశ్ భోపాల్కి చెందిన పవన్(35) దగ్గర అసోం రాష్ట్రానికి చెందిన ఆధార్ ఆన్లైన్ ఐడీలు కొన్నాడు.సిటీలో ఏడుగురు ఫ్రెండ్స్తో కలిసి 6 ఆన్లైన్ సెంటర్లు పెట్టాడు. అప్లికేషన్లు అసోం నుంచే అప్లోడ్ అవుతున్నట్లుగా సాఫ్ట్వేర్ చేంజ్ చేసి అక్టోబర్లో దందా మొదలు పెట్టారు. లోకల్ అడ్రస్, పుట్టిన తేదీ మార్పు చేసుకోవాలనుకున్నోళ్లకు ఫేక్ డాక్యుమెంట్లతో ఆధార్ అప్డేట్చేస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల నుంచి రూ.3 వేలు వసూలు చేశారు. ప్రభుత్వ పెన్షన్ల కోసం వయసులో మార్పులు, షాదీ ముబారక్ పైసల కోసం పైళ్లైన మైనర్లను మేజర్లుగా క్రియేట్ చేసేలా ఆధార్ కార్డులు అప్డేట్ చేశారు. ఇలా 2 నెలల్లో 3 వేలకు పైగా ఆధార్ ఎన్రోల్మెంట్స్, అప్డేట్స్ కోసం అప్లై చేశారు. దీనిని గుర్తించిన యూఐడీఐఏ సిటీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వీళ్ల గుట్టు బయపడింది.