ప్రకాశం జిల్లాలో నకిలీ ఏసీబీ అధికారుల బాగోతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.మేము ఏసీబీ అధికారులం మాట్లాడుతున్నాం... మీ అవినీతి చిట్టా మొత్తం మా దగ్గర ఉంది. మర్యాదగా మేము అడిగినంత నగదు పంపకపోతే... కేసు పెట్టి లోపలేస్తామని పలువురు వీఆర్ఏలను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు
అసలు ఏం జరిగిందంటే... ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులే టార్గెట్గా కేటుగాళ్లు రంగంలోకి దిగారు. ఏసీబీ అధికారులమంటూ ఏకంగా ఎనిమిది మంది వీఆర్వోలకు వరుసగా బెదిరింపు కాల్స్ చేశారు. మీరు చేసిన తప్పుల చిట్టా, అవినీతి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి... మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే వెంటనే మేము చెప్పిన అకౌంట్కు డబ్బులు పంపాలి అంటూ దుండగులు తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేశారు.
దుండగులు చేసిన ఆ బెదిరింపులకు ఒక వీఆర్వో తీవ్రంగా భయపడిపోయారు. ఉద్యోగం ఎక్కడ ఊడుతుందో, ఎక్కడ అరెస్ట్ అవుతానో అనే ఆందోళనతో నకిలీ ఏసీబీ అధికారుల ఖాతాకు ఏకంగా రూ.1.50 లక్షల నగదును బదిలీ చేసినట్లు సమాచారం. మిగిలిన వీఆర్వోలు కూడా ఈ ఫోన్ కాల్స్తో తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు.
అయితే ఈ వ్యవహారం మొత్తం బయటకు పొక్కడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వీఆర్వోలకు వచ్చిన బెదిరింపుల ఘటనపై... పోలీసులు ప్రస్తుతం అత్యంత రహస్యంగా ఆరా తీస్తున్నారు. ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి? ఆ బ్యాంక్ ఖాతా ఎవరి పేరు మీద ఉంది? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
