- పోలింగ్ ప్రశాంతం.. ఓటేసిన 9500 మంది డెలిగేట్లు
- బళ్లారిలో ఓటేసిన రాహుల్ గాంధీ
- రేపు ఓట్ల లెక్కింపు, రిజల్ట్స్ప్రకటన
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో 96% ఓటింగ్ నమోదైందని పార్టీకి చెందిన సెంట్రల్ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్ర్తీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 9,900 మంది డెలిగేట్లలో 9,500 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిస్ర్తీ మాట్లాడారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 4 గంటల దాకా కొనసాగిందన్నారు. దేశవ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో100% ఓటింగ్ నమోదైందన్నారు. అన్ని చోట్ల 90శాతానికి పైగా పోలింగ్ రికార్డయినట్టు వివరించారు. ప్రశాంతయుత వాతావరణంలో అధ్యక్ష పదవికి ఎన్నికలు ముగిశాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ఏంటో ఈ ఎన్నికలతో చూపించిందన్నారు. ఇది రహస్య ఓటింగ్ అని, ఎవరు.. ఎవరికి ఓటేశారో ఎవరికీ తెలియదని, ఈ విషయంలో భయపడొద్దని మిస్త్రీ తెలిపారు. 19న ఏఐసీసీ ఆఫీస్లోనే ఓట్ల లెక్కింపు ఉంటుందని, అదే రోజు రిజల్ట్స్ ప్రకటిస్తామని చెప్పారు. చెల్లని ఓట్లను పక్కనపెట్టేసి.. ఎవరికైతే 50శాతానికి పైగా ఓట్లు నమోదవుతాయో వారే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవుతారని వివరించారు.
బళ్లారిలో ఓటేసిన రాహుల్గాంధీ
కాంగ్రెస్ సీనియర్ లీడర్లు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు తమ ఓటు హక్కును కర్నాటకలో వినియోగించుకున్నారు. భారత్ జోడో యాత్రలో ఉన్న డెలిగేట్ల కోసం బళ్లారి జిల్లా సంగనకల్లులో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మరో 40 మంది డెలిగేట్లతో కలిసి రాహుల్ గాంధీ ఓటేశారు. అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే బెంగళూరులోని పార్టీ ఆఫీస్లో ఓటేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. శశిథరూర్ తనకు మిత్రుడేనని స్పష్టం చేశారు. కాగా, తిరువనంతపురంలో ఓటేశాక శశి థరూర్ మీడియాతో మాట్లాడారు. పార్టీ లీడర్ షిప్ మార్పు కోసమే తాను ఎదురుచూస్తున్నట్టు శశి థరూర్ చెప్పారు. పార్టీకి బలమైన నాయకత్వం అవసరమని పేర్కొన్నారు.
ఈ రోజు కోసమే ఎదురు చూశా: సోనియా
ఏఐసీసీ హెడ్క్వార్టర్లో ఏర్పాటు చేసిన 68వ పోలింగ్ బూత్లో పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి సోనియా గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్వాత బయటికొచ్చిన సోనియా మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏండ్ల నుంచి ఈ రోజు కోసమే ఎదురు చూశానని సోనియా గాంధీ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ లీడర్లు జైరాం రమేశ్, అంబికా సోని, అజయ్ మాకెన్, వివేక్ తన్ఖాతో పాటు పలువురు నేతలు ఏఐసీసీ హెడ్క్వార్టర్లో ఓటేశారు.