జైపూర్: రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో 20 ఏండ్ల దళిత యువతిని గ్యాంగ్ రేప్ చేసి హత్యచేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్న అధికారులు వారిని సస్పెండ్ చేశారు. ఖాజువాలా ఏరియాలో మంగళవారం యువతి డెడ్బాడీని గుర్తించామని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ) ఓం ప్రకాశ్ తెలిపారు. బాధిత యువతి కుటుంబ సభ్యులు ఇద్దరు కానిస్టేబుల్స్తో సహా ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్స్ మనోజ్, భగీరథ్ మూడో నిందితుడితో కలిసి యువతిని ఆమె ఇంటినుంచి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారని ఆరోపించారు. కాగా, నిందితులను అరెస్టు చేసేవరకు యువతి డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించొద్దని బాధిత కుటుంబం ధర్నా చేసింది.
దీంతో ఇద్దరు పోలీసులును వెంటనే సస్పెండ్ చేశామని ఐజీ వెల్లడించారు. ఫోన్కాల్ రికార్డుల ప్రకారం బాధిత యువతి, ప్రధాన నిందితుడికి పరిచయం ఉందని తేలిందని ఎస్పీ తేజస్విని గౌతమ్ చెప్పారు. కాగా, ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నేతలు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై మండిపడ్డారు. యువతిపై అత్యాచారం, హత్య కేసులో ఇద్దరు పోలీసులు కూడా నిందితులుగా తేలడం ప్రభుత్వానికి కళంకమని రాజేంద్ర రాథోడ్ ట్వీట్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్స్ను అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. దీనిపై పౌర సరఫరాల మంత్రి ప్రతాప్సింగ్ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.