హైదరాబాద్: పదిహేను వందల రూపాయల కోసం ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన దారుణ ఘటన మాదన్నపేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. మాదన్న పేట ఇన్స్ పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం… మాదన్నపేట కుర్మగూడకు చెందిన అబ్దుల్ గఫార్ (27) బావార్చిలో పని చేస్తున్నాడు. అతని బావ అహ్మద్ హుస్సేన్.. సల్మాన్ ఖాన్ అనే వ్యక్తికి అత్యవసరంగా డబ్బులు అవసరం పడటంతో ఫోన్ తాకట్టు పెట్టుకొని, రూ.1500 అప్పు ఇచ్చాడు.
ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ తమ్ముడు అమీర్ ఖాన్ (21) తన సోదరుడి ఫోన్ ఇవ్వాలని అహ్మద్ హుస్సేన్ తో వారం క్రితం గొడవ పడ్డాడు. అబ్దుల్ గఫర్ ఈ గొడవలో జోక్యం చేసుకొని,తీసుకున్న డబ్బులు ఇచ్చిన తరువాతనే ఫోన్ ఇవ్వడం జరుగుతుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయం మనస్సులో పెట్టుకున్న అమీర్ ఖాన్ గురువారం కుర్మగూడ పాన్షాపు దగ్గర అబ్దుల్ గఫర్ పై కత్తితో దాడి చేసి పారిపోయాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అమీర్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. బాధితుడిని పోలీసులు చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పటల్ కు తరలించారు.