వల్సాద్‌లో వందే భారత్ రైలుకు మరోసారి ప్రమాదం

వల్సాద్‌లో వందే భారత్ రైలుకు మరోసారి ప్రమాదం

గుజరాత్‌లోని వల్సాద్‌ సమీపంలో వందే భారత్ రైలు మరోసారి ప్రమాదానికి గురైంది. ఈ సంఘటన వల్సాద్‌కు చెందిన అతుల్ సమీపంలో జరిగింది. వందేభారత్ రైలును ఆవు ఢీకొట్టిందని రైల్వే అధికారులు వెల్లడించారు. దీంతో రైలు ముందు భాగం దెబ్బతిన్నది. అదే సమయంలో రైలు ఇంజన్‌కి సమీపంలోని దిగువ భాగం డ్యామేజ్ అయింది. అయితే ఈ ఘటనలో ప్రస్తుతం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం.

అకస్మాత్తుగా రైల్వే ట్రాక్ పైకి ఆవు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన తర్వాత  దాదాపు30 నిమిషాల పాటు ఆ రైలు అక్కడే నిలిచిపోవల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న రైల్వే శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ రైలు  అక్కడ్నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం.

https://twitter.com/ANI/status/1586248277346832384

గాంధీనగర్- ముంబై మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సైతం గతంలో రెండుసార్లు ప్రమాదానికి గురైంది. ఈ రెండు ప్రమాదాల్లో రైలు ముందు భాగం దెబ్బతింది. మొదటి ఘటన అక్టోబర్ 6 న జరిగింది, గుజరాత్ నుండి ముంబైకి వేగంగా వెళుతున్న రైలు  ఒక్కసారిగా 4 గేదెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఆ తర్వాత రెండో ప్రమాదం మరుసటి రోజు అంటే అక్టోబర్ 7న జరిగింది. ఆ సమయంలో కూడా అకస్మాత్తుగా ట్రాక్‌పైకి ఓ ఆవు వచ్చింది. ఈ రెండు ప్రమాదాల్లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఈసారి కూడా రైలు ముందు భాగం దెబ్బతిన్నది.