కానిస్టేబుల్ వీరంగం.. యువకుడిపై దాడి

కానిస్టేబుల్ వీరంగం..  యువకుడిపై దాడి

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో ఓ కానిస్టేబుల్​ వీరంగం చేశాడు. ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. ఆపై అతడి బాబాయిని కారుతో ఢీకొట్టి బ్యానెట్ పైనే కొంతదూరం లాక్కెళ్లాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 30న రాత్రి ముచ్చింతల్​లోని స్పెషల్​ బ్రాంచ్​కు చెందిన హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ ఇంటి ముందు నుంచి పవన్ కళ్యాణ్ అనే యువకుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే పదేపదే తన ఇంటి ముందు నుంచి ఎందుకు వెళ్తున్నావని ఆ యువకుడ్ని జ్ఞానేశ్వర్ ప్రశ్నిం చాడు. 

ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. పవన్​ కల్యాణ్​పై జ్ఞానేశ్వర్ దాడి చేశాడు. కులం పేరుతో తిట్టాడు. ఆ తర్వాత కొంతసేపటికి అదే దారిలో పవన్​కల్యాణ్ తన బాబాయ్​ రాజుతో కలిసి వెళ్తున్నారు. అదే టైమ్​లో కారులో వచ్చిన కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ ఆ ఇద్దరిపైకి కారును పోనిచ్చాడు. దీంతో రాజు పైకి ఎగిరి కారు బ్యానెట్​పై పడ్డాడు. అయినా ఆగకుండా కానిస్టేబుల్ అలాగే కారును దాదాపు 200 మీటర్ల వరకు లాక్కెళ్లాడు. రాజు గాయపడ్డాడు. ఇదంతా  అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్​ అయింది. 

ఈ ఘటనపై పవన్ కల్యాణ్ శంషాబాద్ రూరల్ పీఎస్​లో కంప్లయింట్ చేశాడు. అయితే పోలీసులు ఏమాత్రం స్పందించడం లేదని, కానిస్టేబుల్​పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, కానిస్టేబుల్ దాడిలో పవన్​కల్యాణ్​కు సైతం గాయాలు కాగా హాస్పిటల్​లో ట్రీట్ మెంట్​ తీసుకున్నాడు. అతడిని స్థానిక బీఎస్పీ నేతలు పరామర్శిం
చారు.  ఈ ఘటనపై విచారణ జరిపి కానిస్టేబుల్​పై  చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.