
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిపై హైదరాబాద్కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి తన అపారమైన భక్తిని చాటుకున్నారు. మరణానంతరం టీటీడీకి రూ.3 కోట్ల విలువైన నివాస గృహం, 66 లక్షల రూపాయల విరాళం టీటీడీకి చెందుతుందని వీలునామా రాశారు. ఈ వీలునామా రాసిన.. హైదరాబాద్కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి వై.వి.ఎస్.ఎస్. భాస్కర్ రావు చనిపోవడంతో వీలునామా ప్రకారం రూ.3 కోట్ల విలువైన నివాస గృహంతో పాటు తన బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న రూ.66 లక్షల విరాళం టీటీడీకి అందింది.
హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతంలో ఉన్న “ఆనంద నిలయం” అనే 3,500 చదరపు అడుగులు గల భవనాన్ని, ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఆయన టీటీడీకి విరాళంగా ఇస్తున్నప్పుడు వీలునామాలో పేర్కొన్నారు.
తను బ్యాంకులో దాచుకున్న సొమ్మును.. టీటీడీ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన సేవలు అందిస్తున్న శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు 36 లక్షల రూపాయలు, శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్ట్కు రూ.6 లక్షలు, శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవాణి ట్రస్టుకు రూ.6 లక్షలు విరాళంగా అందివ్వాలని సంకల్పించారు.
తన జీవితాంతం శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో అంకితమై ఉండాలని ఆకాంక్షించిన భాస్కర్ రావు అంతిమ కోరిక మేరకు ఆయన మరణానంతరం ట్రస్టీలు ఎం.దేవరాజ్ రెడ్డి, వి.సత్యనారాయణ, బి.లోకనాథ్లు వీలునామా ప్రకారం టీటీడీకి చెందాల్సిన ఆస్తి పత్రాలు, చెక్కులను గురువారం ఉదయం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీ.హెచ్. వెంకయ్య చౌదరికి అందజేశారు. భాస్కర్ రావు ట్రస్టీలను అదనపు ఈవో సత్కరించారు.