ఓల్డ్సిటీ, వెలుగు: భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ భర్త గొడ్డలితో అతిదారుణంగా నరికి చంపాడు. అనంతరం నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. నల్గొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన నర్సింహ (60), వసంత (52) దంపతులు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి మీర్పేట్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్లో నివసిస్తున్నారు. వసంత ఎవరితోనో ఫోన్ మాట్లాడుతోందన్న అనుమానంతో ఆగ్రహానికి గురైన నర్సింహ.. ఆమెపై బుధవారం గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన వసంత అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడు గొడ్డలిని సమీపంలోని చెట్ల పొదల్లో పడేసి, నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

