- ఉత్తరాఖండ్లో ఘటన.. యూపీ పోలీసులపై మర్డర్ కేసు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని గ్రామస్తులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు జరిపిన కాల్పుల్లో స్థానిక బీజేపీ నేత భార్య చనిపోయింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. యూపీ పోలీసులపై అక్కడి ప్రభుత్వం హత్య కేసు నమోదు చేసింది. యూపీ మైనింగ్ ముఠా సభ్యుడైన జాఫర్ పారిపోయి, ఉత్తరాఖండ్ జస్పూర్లోని బీజేపీ లీడర్ గుర్తాజ్ భుల్లార్ సింగ్ ఇంట్లో దాక్కున్నట్టు యూపీ పోలీసులకు తెలిసింది. ఇప్పటికే జాఫర్పై రూ.50వేల రివార్డు ఉంది. అతన్ని పట్టుకునేందుకు మోరాదాబాద్కు చెందిన ఐదుగురు పోలీసులు మఫ్టీలో బుధవారం రాత్రి జాస్పూర్ వెళ్లారు. రెక్కీ చేసి.. భుల్లార్ ఇంట్లోనే జాఫర్ ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. అతన్ని అరెస్టు చేసేందుకు గుర్తాజ్ ఇంటికి వెళ్లగా, భుల్లార్ కుటుంబ సభ్యులు వాళ్లను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య అరగంట వరకు గొడవ జరిగింది. అప్పటికే గ్రామస్తులంతా పోలీసులను చుట్టుముట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులకు, స్థానికులకు మధ్య ఫైరింగ్ జరిగింది. యూపీ పోలీసుల బుల్లెట్ తగలడంతో గుర్తాజ్ భార్య గుర్ప్రీత్ కౌర్ స్పాట్లోనే చనిపోయింది. దీంతో మరింత ఆగ్రహించిన గ్రామస్తులు, భుల్లార్ కుటుంబ సభ్యులు పోలీసుల దగ్గర నుంచి వెపన్స్ లాక్కొని దాడి చేశారు. ఇద్దరు పోలీసులు పారిపోగా.. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే అప్పటికే జాఫర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
పరిస్థితి అదుపులోనే: ఉత్తరాఖండ్ పోలీసులు
ఫైరింగ్ విషయం తెలుసుకున్న ఉత్తరాఖండ్ పోలీసులు, ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన పోలీసులు, గ్రామస్తులను హాస్పిటల్కు తరలించారు. ఊళ్లో అదనపు బలగాలను మోహరించినట్టు ఉధమ్సింగ్ నగర్ పోలీసులు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని, గుర్ప్రీత్ కౌర్ చనిపోవడంతో ఐదుగురు యూపీ పోలీసులపై మర్డర్ కేసు ఫైల్ చేసినట్టు వివరించారు. కొంతమంది గ్రామస్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.
దాడి వెనుక కుట్ర: గుర్తాజ్ భుల్లార్
యూపీ పోలీసుల కాల్పులను నిరసిస్తూ గ్రామస్తులతో పాటు భుల్లార్ ఫ్యామిలీ మెంబర్స్ జస్పూర్లో ధర్నాకు దిగారు. ఈ కాల్పుల వెనుక పెద్ద కుట్ర ఉందని, సీబీఐతో కేసును విచారించాలని హర్ప్రీత్ కౌర్భర్త గుర్తాజ్ భుల్లార్ డిమాండ్ చేశారు. యూపీ పోలీసులే కాల్పులు జరిపారని, తాము ఎలాంటి ఆయుధాలు వాడలేదన్నారు. తామే ఆయుధాలను పోలీసులకు అప్పగించామన్నారు.