
బషీర్బాగ్, వెలుగు: ఓటుకు నోటు కేసులో తాను విలువైన సమయాన్ని, జీవితాన్ని కోల్పోయాని గతంలో ఏ4 నిందితుడిగా ఉన్న బెరూసలేం మత్తయ్య భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం ఆయన బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఓటు విలువ కాపాడటానికి త్వరలో ఓ సంస్థను ఏర్పాటు చేసి పోరాటం చేయనున్నట్లు ప్రకటించారు.
ఓటుకు నోటు కేసులో 2015 మే 31న తెలంగాణ ఏసీబీ, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, తాను ఏ తప్పు చేయనందున ఈ నెల 26న సుప్రీం కోర్టు తనపై ఉన్న కేసు కొట్టివేసిందని చెప్పారు. దాదాపు పదేండ్లు తాను తీవ్ర అవమానానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు, వివిధ పోలీసు స్టేషన్లు, టీడీపీ ఆఫీసు చుట్టూ తిరిగి విలువైన సమయంతో పాటు డబ్బులు పోగొట్టుకున్నానన్నారు.