మహారాష్ట్ర: కూతురికి స్వీటు కొనివ్వడానికి భర్తను 5 రూపాయలు అడిగినందుకు కసాయి తండ్రి బిడ్డను కొట్టి చంపాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. గోండియా జిల్లా, లోనారా గ్రామానికి చెందిన వివేక్, వర్షా దంపతులకు 20నెలల వైష్ణవి అనే కూతురుంది. తనకు స్వీటు ఇప్పించమని కూతురు ఏడుస్తుండటంతో భర్తను ఐదు రూపాయలు ఇవ్వాలని అడిగింది భార్య వర్షా. దీంతో పట్టరాని కోపానికి గురైన వివేక్ తన కూతుర్ని తీసుకొని తలుపు, ఇంటి మెట్ల మీద కొట్టాడు.
అడ్డుకోబోయిన తనపై కూడా దాడి చేయగా, తాను పారిపోయానని భార్య వర్షా చెప్పారు. తీవ్రగాయాల పాలైన వైష్ణవిని టిరోడా ఉప జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే బాలిక మరణించిందని చెప్పారు డాక్టర్లు. దీంతో భార్య వర్షా భర్త వివేక్ పై టిరోడ పోలీసులకు ఫిర్యాదు చేయగా వివేక్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు.
