పద్మారావునగర్, వెలుగు: గర్భాశయంలో ఏర్పడిన చిన్న గడ్డను తొలగించుకునేందుకు ఓ ప్రైవేట్హాస్పిటల్కు వెళ్లిన ఓ వివాహిత మృతి చెందింది. డాక్టర్నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి కుటుంబసభ్యులు దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడకు చెందిన దివ్య(31), ఆమె భర్త వికాస్ సంతానం కోసం ఏడాదిగా మారేడ్పల్లిలోని బృందావన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దివ్య గర్భాశయంలో చిన్న గడ్డ ఏర్పడటంతో దాన్ని తొలగించేందుకు డాక్టర్ గీతాంజలి సోమవారం ఉదయం 8 గంటలకు ల్యాపరోస్కోపిక్ సర్జరీ చేయగా.. తీవ్ర రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమించడంతో డాక్టర్ అక్కడి నుంచి పరారయ్యారు.
ఆపరేషన్ అనంతరం కుట్లు కూడా సరిగా వేయలేదని, తర్వాత చికిత్స అందించినా లాభం లేకుండా పోయిందని బాధితులు తెలిపారు. దివ్య మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ హాస్పిటల్ఎదుట ఆందోళనకు దిగారు. దవాఖాన అద్దాలు, సామగ్రిని ధ్వంసం చేశారు.
తుకారాం గేట్ ప్రధాన రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. డాక్టర్లు గీతాంజలి, శ్రీకాంత్లపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
