- బీజాపూర్ జిల్లా గంగలూరు
- అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర పోరు
- ఘటనాస్థలంలో ఆయుధాలు లభ్యం
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. గంగలూరు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకరపోరు సాగింది. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. బస్తర్ ఐజీ సుందర్రాజ్ కథనం ప్రకారం.. లోక్ సభ ఎన్నికల వేళ భద్రతా బలగాలను మట్టుబెట్టేందుకు కోర్చోలీ-లోంద్రా అడవుల్లో గ్రామస్తులతో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారం రావడంతో భద్రతా బలగాలు కూంబింగ్కు వెళ్లాయి.
యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో భాగంగా ఉదయం 6 గంటల సమయంలో కోర్చోలీ-లోంద్రా అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్, సీఏఎఫ్ బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దాడి నుంచి తేరుకున్న తర్వాత భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగగా, సుమారు 3 గంటలపాటు భీకరయుద్ధం జరిగింది. ఊహించని రీతిలో పీఎల్జీఏ దళాలు కాల్పులకు తెగబడ్డాయి.
వ్యూహాత్మకంగా భద్రతాబలగాలు అంచలంచెలుగా మావోయిస్టులను చుట్టుముట్టి కాల్పులు జరిపాయి. ఒకచోట నలుగురు, మరోచోట ఆరుగురు.. మొత్తం10 మంది మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో 9 మంది పురుషులు, ఒక మహిళా మావోయిస్టు ఉన్నారు. మృతదేహాలతోపాటు ఏకే-47, ఇన్సాస్ ఎల్ఎంజీ, ఆటోమెటిక్ గన్స్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, పారిపోయిన మావోయిస్టులలో పలువురు గాయాలతో ఉన్నారని బీజాపూర్ జిల్లా కేంద్రానికి భద్రతా బలగాలు సమాచారం అందించడంతో వారికోసం అదనపు బలగాలను కోర్చోలీ-లోంద్రా అటవీ ప్రాంతానికి తరలించారు. మృతదేహాలను, ఆయుధాలను బీజాపూర్ జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ ఎన్కౌంటర్పై గంగలూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో ఈ ఏడాది ఇదే పెద్ద ఎన్కౌంటర్ అని సుందర్రాజ్ పీ వెల్లడించారు.
బాలాఘాట్లో మరో ఇద్దరు మావోయిస్టులు..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కేరాఝారీ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డ సమయంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో రఘు అలియాస్ షేర్ సింగ్, సంజతి అలియాస్ క్రాంతి మృతిచెందారు. ఎన్కౌంటర్ స్పాట్లో ఏకే 47, 12 బోర్ గన్స్ లభించా.
బదులు తీర్చుకున్న భద్రతా బలగాలు
సరిగ్గా మూడేండ్ల క్రితం 2021 ఏప్రిల్ మూడో తేదీన మావోయిస్టులు మాటేసి బీజాపూర్జిల్లా టేకులగూడలో 22 మంది 210 బెటాలియన్ సీఆర్పీఎఫ్ జవాన్లను దారుణంగా కాల్చి చంపారు. అప్పటి నుంచి భద్రతాబలగాలు మనోస్థైర్యం కోల్పోయి, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నాయి. యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో మంగళవారం భద్రతా బలగాలు జరిపిన దాడిలో 9 మంది మావోయిస్టులు మృతిచెందడంతో జవాన్లు సంబురాలు చేసుకున్నారు.
మూడేండ్లకింద కూంబింగ్కు వెళ్లి వస్తున్న తమ జవాన్లను మాటు వేసి కాల్చి చంపారని వారు గుర్తు చేసుకున్నారు. దీంతోనే ముగియలేదని, దాడులు ఇంకా పెంచుతామని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. కాగా, బీజాపూర్జిల్లాలోనే వారంరోజుల్లో వరుస దాడుల్లో 16 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతిచెందడం గమనార్హం. ఇటీవలే బాసగూడ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.