న్యూఢిల్లీ: దేశంలోని హెల్త్ సెక్టార్కు సంబంధించిన సర్వర్లపై సైబర్దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ ఎయిమ్స్పై ఒకే రోజు 6 వేల సైబర్ ఎటాక్స్ చేయగా.. ఇప్పుడు కొవిన్ ప్లాట్ఫాంపై దాడులు చేశారు. ఓ ఇరానియన్ హ్యాకర్ కొవిన్ ప్లాట్ఫామ్కు సంబంధించి అడ్మిన్ యాక్సెస్ సాధించానని, పాస్వర్డ్, యూజర్నేమ్ కావలసిన వారు తనను టెలిగ్రాంలో సంప్రదించవచ్చని డార్క్ వెబ్లో ఒక పోస్ట్ పెట్టాడు. కొవిన్ ప్లాట్ఫాంలో ఉన్న హెల్త్ కేర్ వర్కర్లకు సంబంధించిన డేటాను కూడా అమ్మకానికి ఉంచాడు.
కొవిన్ ప్లాట్ఫాంకు సంబంధించిన స్క్రీన్షాట్లను కూడా అతడు షేర్ చేశాడు. కరోనా వ్యాక్సినేషన్కు సంబంధించిన సమాచారం, వ్యాక్సినేషన్ సెంటర్ల వివరాలు, హెల్త్ వర్కర్లు, వ్యాక్సిన్ వేయించుకున్న వారి మొబైల్ నంబర్లు, ఇతర వివరాల వంటి సెన్సిటివ్ సమాచారం కొవిన్ పోర్టల్లో ఉంటుంది. కొవిన్ ప్లాట్ఫాం అడ్మిన్ పేజీ కంట్రోల్స్ తన దగ్గర ఉన్నాయని హ్యాకర్ వెల్లడించాడు. హ్యాకర్ను ఇరాన్కు చెందిన నజిలా బ్లాక్హ్యాట్గా గుర్తించారు. ఇతడు ఇరాన్ సెక్యూరిటీ టీమ్ ఏపీటీ గ్రూప్ కు చెందిన మెంబర్ అని తెలిసింది. వివిధ దేశాల ప్రభుత్వ విభాగాలకు చెందిన సర్వర్లే లక్ష్యంగా ఈ టీమ్ సైబర్ దాడులు చేస్తుంది. వరుస సైబర్ దాడుల నేపథ్యంలో ప్రభుత్వ సర్వర్లను కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అమిత్ దూబే సూచించారు.