మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్ గ్రామంలో పవన్ (35) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బంధువులే అత్యంత దారుణంగా హతమార్చారు. మంత్రాల నెపంతో పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లోని అల్వాల్ కు చెందిన పవన్ (35) బెంగుళూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. బల్వంతపూర్కు చెందిన కృష్ణవేణితో ఆయనకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా, 12రోజుల క్రితం అతని బావమరిది జగన్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ క్రమంలో అత్తింటివారిని పరామర్శించడానికి సోమవారం పవన్ బల్వంతా పూర్ వచ్చాడు. అంతకు వారం క్రితమే పవన్ భార్య కృష్ణవేణి పుట్టింటికి వచ్చింది. కాగా, పవన్ మంత్రాలు చేయడం వల్లే జగన్ చనిపోయాడని జగన్ భార్య సుమలత, జగన్ అన్న విజయ్బాబా, ఇతర కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలోనే గొడవ జరగగా, సోమవారం రాత్రి ఇంట్లోని ఓ గదిలో పవన్ను కొట్టి పెట్రోల్పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. ఆ ఇల్లును ఆనుకొని ఉన్న మంజునాథ సహస్రలింగాలయంలో విజయ్బాబా పూజారిగా ఉన్నాడు. ఇంట్లో గొడవ జరగడం, ఆతర్వాత మంటలు, వాసన రావడంతో చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకునేసరికి పవన్డెడ్బాడీ పూర్తిగా కాలిపోయింది. బంధువులే ఈ హత్యకు పాల్పడ్డారని భావించిన పోలీసులు, జగన్ భార్య సుమలత, జగన్ అన్న విజయ్ బాబా ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతుడి భార్య కృష్ణవేణి నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. డెడ్బాడీని పోస్టు మార్టానికి తరలించి, దర్యాప్తు చేస్తున్నామని జగిత్యాల డీఎస్పీ వెంకట రమణ, మాల్యాల సిఐ కిషోర్, ఎస్ ఐ నాగరాజు వెల్లడించారు.